breaking news
the national level
-
పతనావస్థలో బెల్లం ధరలు
అనకాపల్లి : జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో డిసెంబర్ రెండో వారం లావాదేవీలు అటు వర్తకులకు, ఇటు రైతులకు నిరాశనే మిగిల్చాయి. మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు బెల్లం లావాదేవీలను ప్రభావితం చేస్తున్నాయి. జోరందుకోవాల్సిన సీజన్లో బెల్లం క్రయవిక్రయాలు పడిపోతున్నాయి. డిసెంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు 74,040 క్వింటాళ్ల బెల్లం క్రయవిక్రయాలు జరగ్గా, క్వింటాల్కు కనిష్ట ధర ఈ వారంలో రూ.2,130కి పడిపోయింది. గరిష్ట ధర సైతం 2,900 రూపాయల వద్దే నిలిచింది. బెల్లం లావాదేవీలు తగ్గినప్పుడు సహజంగా ధరలు పెరగాలి. కానీ రెండవ వారంలో క్వింటాలు బెల్లం 3 వేల రూపాయలకు చేరుకోకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చెరకు బెల్లాన్ని వండినప్పటికీ అనకాపల్లి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించలేదనేది రైతుల ఆవేదన. 2013లో డిసెంబర్ రెండో వారంలో 82,721 క్వింటాళ్ల లావాదేవీలు జరిగాయి. ఆరు రోజుల లావాదేవీల్లో భాగంగా క్వింటాలు బెల్లం కనిష్టంగా 2,340 రూపాయలు పలకగా, గరిష్టంగా 2,850 రూపాయలు పలికింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ రెండో వారం లావాదేవీలు 8,681 క్వింటాళ్లు తగ్గినట్లయింది. మూడో రకం బెల్లం కనిష్ట ధర గత ఏడాది కంటే ఈసారి మరీ దయనీయంగా 2,130 రూపాయలు పలికిందంటే ధరలు పతనావస్థలో ఉన్నట్లు గమనించవచ్చు. ఇక గరిష్ట ధర విషయంలో గత ఏడాది 2,850 రూపాయలు పలకగా, ఈ ఏడాది 2,900 వద్ద గరిష్ట ధర నిలిచింది. మూడో రకం బెల్లం ధర తగ్గినప్పటికీ ఈ ఏడాది చెరకు రైతులు విపత్కర పరిస్థితులను చవిచూశారు. హుద్హుద్ కారణంగా చెరకు పంట ధ్వంసం కాగా కాస్తోకూస్తో మిగిలిన చెరకు నేలపాలయింది. కరెంట్ కోత కారణంగా నేలపాలైన చెరకును అక్కడికక్కడే వండకపోవడంతో మార్కెట్కు సరఫరా అయ్యే బెల్లం అధికంగా నలుపురంగే వస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది రైతులు దిగుబడిపరంగానే కాకుండా గిట్టుబాటుపరంగా కూడా నష్టపోయారు. అటువంటి సంకేతాలే రెండో వారం మార్కెట్ ప్రస్ఫుటం చేసింది. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అనకాపల్లి మార్కెట్కు అప్పటివరకు కొనసాగిన ఆ సీజన్కు గరిష్టంగా 25,535 దిమ్మల లావాదేవీలు జరిగాయి. మరి ఈ సీజన్లో బెల్లం లావాదేవీలు 25 వేల దిమ్మల క్రయవిక్రయాలకు దాటుతాయో లేదో మూడో వారం లావాదేవీలను బట్టి తెలుస్తుంది. -
ఊరటనిచ్చిన లావాదేవీలు
బెల్లం మార్కెట్ వర్గాల్లో ఆనందం 9 లక్షల దిమ్మల క్రయవిక్రయం రూ.33 నుంచి రూ.35 కోట్ల వ్యాపారం అనకాపల్లి, న్యూస్లైన్ : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెలలో 9 లక్షల బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు జరిగినట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇవి లక్షా 35 వేల క్వింటాళ్ల వరకు ఉంటాయి. సుమారు 33 నుంచి 35 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరిగినట్లయింది. వాస్తవానికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో బెల్లం క్రయ విక్రయాలు మందకొడిగా సాగాయి. డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 55.76 కోట్ల లావాదేవీలు మాత్రమే జరగడంతో 2012-13 సీజన్ లావాదేవీలను అధిగమిస్తుందోలేదోనని మార్కెట్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మార్కెట్లో సుమారు రూ.65 కోట్ల పైబడి వ్యాపారం జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 2012-13 సీజన్కు నీలం తుఫాన్, 2013-14 సీజన్కు భారీ వర్షాలు, నీటిముంపు చెరకు పంటకు తీవ్రనష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2011-12 సీజన్లో అనకాపల్లి మార్కెట్లో రూ.161.61 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2012-13 సీజన్కు అంతకు ముందు సీజన్తో పోలిస్తే రూ.18 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో నీలం తుఫాన్ కారణాన్ని చూపించి మార్కెట్ వర్గాలు ఉపశమనం పొందాయి. 2013 -14 సీజన్లో కూడా ఇంచుమించు గా రూ.140 కోట్ల లావాదేవీలు జరగడంతో ఈసారి కూడా భారీ వర్షాలు, నీటిముంపును చూసి మార్కెట్ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, జిల్లాలో సాధారణ విస్తీర్ణంకంటే తక్కువుగానే చెరకు సాగు జరగడం, భారీ వర్షాల తాకిడి తోడవడంతో 2013-14 సీజన్ నిరాశాజనకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు ముందే అంచనా వేశాయి. దీనికితోడు బెల్లం ధరలు సైతం ఈ సీజన్లో అటు రైతులను, ఇటు వర్తకులను నిరాశపరిచాయి. ఏదిఏమైనా మార్చి నెలలో జరిగిన లావాదేవీలు సీజన్లో తగ్గిన వ్యాపారానికి కాసింత సర్దుబాటు చేశాయని చెప్పవచ్చు.