breaking news
liquidity shortfall
-
వాహన ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ.. ► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి. -
బ్యాంకుల్లో నగదు కొరత: నాలుగేళ్ల గరిష్టానికి!
India banking liquidity deficit: దేశీయ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ కొరతపై రిపోర్ట్ ఒకటి ఆందోళన రేపుతోంది. ఈ ఏడాదిలో ఈ నెల (సెప్టెంబరు) 20నాటికి బ్యాంకింగ్ లిక్విడిటీ లోటు రూ. 1.46 లక్షల కోట్ల వద్ద నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టులో తొలిసారిగా దేశీయ బ్యాంకుల్లో లిక్విడిటీ లోటులోకి జారుకుంది. నివేదిక ప్రకారం, ఏప్రిల్ 23, 2019 తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే కొరత. మే 19 , జూలై 28 మధ్య స్వీకరించిన ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10శాతం ఇన్క్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ICRR)గా పక్కన పెట్టాలని ఆర్బీఐ ఆదేశించిన తరువాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా బ్యాంకులవద్ద మిగులు నగదు నిల్వ తగ్గింది. అయితే ముందుస్తు పన్ను చెల్లింపలు, జీఎస్టీ చెల్లింపులతో నగదు కొరతకు దారితీశాయనిపేర్కొంది. (భారత్-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం) ఈ క్రమంలోనే బ్యాంకులు ఎంఎస్ఫ్ (మార్జినల్ స్టాండింగ్ సదుపాయం) కింద రికార్డు స్థాయిలో రూ. 1.97 లక్షల కోట్ల రుణాలు, అలాగే ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం కింద దాదాపు రూ. 46,724 కోట్లను నిలిపివేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.రూ. 2.50 లక్షల కోట్ల వరకు మొత్తం బయటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు తెలిపింది. ఎందుకంటే అదే రిపోర్టింగ్ పక్షం రోజులలో జంట అవుట్ఫ్లోలు (ముందస్తు పన్ను చెల్లింపుల , జీఎస్టీ ) సంభవించాయని బ్యాంకర్లను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. రూపాయిపై ఒత్తిడి డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులతో వచ్చే ఇబ్బందులను, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ముప్పును తప్పించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ విధించిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్) సైతం నగదు లోటుకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఏడాది ఆగస్టు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకులు తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10 శాతాన్ని పక్కనబెట్టాలని ఆదేశించింది.. కాగా, ఇంచుమించుగా వచ్చే నెల మొదటి వారం వరకు బ్యాంకులు ఇదే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్న అంచనాను కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్ వెలిబుచ్చారు. అంతేకాకుండా, డాలరు మారకంలో రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగితే, RBI ద్వారా FX జోక్యంతో మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా రాయిటర్స్తో వ్యాఖ్యానించారు. ఐసీఆర్ఆర్తోపాటు, ఆగస్టు నాటి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను విధింపుతో లిక్విడిటీ బిగుతు పెరుగుతోందంటున్నారు రూపాయిపై ఒత్తిడి ,అంతర్లీన ద్రవ్యోల్బణ నష్టాలను కూడా నిరోధించవచ్చని, స్వల్పకాలిక రేట్లను పెంచడానికి బదులుగా ఆర్బీఐ RBI సమీప కాలంలో ద్రవ్యతను కఠినంగా ఉంచుతుందని భావిస్తున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్నా భరద్వాజ్. ఈ నెలాఖరు నాటికి ద్రవ్యలోటు తగ్గుతుందని ఆమె తెలిపారు. లిక్విడిటీ లోటు అంటే సరళంగా చెప్పాలంటే, లిక్విడిటీ అంటే ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది లేదా ఎంత త్వరగా నగదును పొందగలరు అనేది. ఉదాహరణకు, సేవింగ్స్ ఖాతా కంటే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అదే సేవింగ్స్ ఖాతా నుంచి అయితే మనకు అవసరమైనప్పుడు నగదు తీసుకోవచ్చు.బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ అంటే బ్యాంకుల స్వల్పకాలిక వ్యాపారం, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది అనేది. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్కాయిన్ ఈటీఎఫ్లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్లో క్రిప్టో ఎక్సేంజ్లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్ఎక్స్లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్కాయిన్లో లాభం వచ్చి, బిట్ కాయిన్లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్కాయిన్లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్ను ఎక్సే్ఛంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
ఆ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా: వినియోగదారులకు షాక్
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. లిక్విడిటీ కొరత నేపథ్యంలో దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఈ బ్యాంకు ఖాతాదారులు ఆరు నెలల కాలానికి తమ పొదుపు ఖాతా నుండి రూ .1000 కన్నా ఎక్కువ ఉపసంహరించుకోలేరు. ఈ మేరకు బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీచేసినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. అయితే బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని, తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు ఆంక్షలతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ స్థితిని పరిశీలిలంచిన ఆంక్షల నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అన్ని పొదుపు, కరెంట్ లేదా డిపాజిట్స్ ఏదైనా ఇతర ఖాతాల్లోని బ్యాలెన్స్నుంచి 1000 రూపాయలకు మించకుండా ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే కొత్త రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం, ఇతర వ్యాపారంపై కూడా ఆరు నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే షరతులకు లోబడి డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని తెలిపింది. 99.58 శాతం డిపాజిటర్లు పూర్తిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) భీమా పథకం పరిధిలోకి వస్తారని రెగ్యులేటర్ పేర్కొంది. -
రీమోనిటైజేషన్ పూర్తయ్యింది..
నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై అరుణ్జైట్లీ రాంచీ: పెద్ద నోట్ల అనంతరం నెలకొన్ని ద్రవ్య కొరత సమస్య దాదాపు తొలగిపోయిందనీ, రీమోనిటైజేషన్ (నగదును అందుబాటులోకి తీసుకురావడం) ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందనీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ గురువారం పేర్కొన్నారు. రోజూవారీ నగదు సరఫరా పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జాగ్రత్తగా పరిశీలిస్తోందని కూడా జైట్లీ వివరించారు. నల్లధనం నిరోధం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు లావాదేవీల డిజిటలైజేషన్ వంటి లక్ష్యాలను ఉద్దేశించి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో నగదు లభ్యత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జార్ఖండ్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నేరాలు పెరగడానికి, పన్నులు ఎగవేయడానికి నగదు ఆధారిత వ్యవస్థ దోహదపడుతుందనీ విశ్లేషించారు. ⇔ దేశంలో ప్రస్తుత వాణిజ్య, వ్యాపార విధానాలు మారాలని ఆయా అంశాలు మరింత సరళతరం కావాల్సి ఉందని విశ్లేషించారు. ⇔ నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు ఆయా నోట్ల డిపాజిట్లు ఎంత మొత్తంలో జరిగాయన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘కరెన్సీ లెక్కింపు ప్రక్రియ ఆసాంతం పూర్తయిన తర్వాతే సంబంధిత డిపాజిట్ల మొత్తాన్ని వెల్లడించడం జరుగుతుంది’’ అని ఇటీవలే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. నోట్ల రద్దుతో వృద్ధి పెరుగుతుంది: ఆర్థికశాఖ ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో 23 శాతం ‘‘షాడో ఎనాకమీ’గా ఉందని, పేర్కొన్న ఆయన, నోట్ల రద్దు, డిజిటలైజేషన్ చొరవల వల్ల ఇక ముందు పన్ను చెల్లింపుల పరిధి మరింత విస్తరిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నగదు నిష్పత్తి 4 శాతం ఉంటే, భారత్లో ఏకంగా 12 శాతంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చొరవతో ప్రజలు డిజిటల్ ఆర్థిక లావాదేవీలవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు.