breaking news
legalized
-
లాభాల కోసం క్రిప్టోల రిస్క్లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
నరకయాతన లేని చావు.. తిట్టిపోస్తున్న జనం!
Suicide Pods Are Now Legal In Switzerland: హిట్లర్.. నాజీ సైన్యం తమ శత్రువులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేదని, పారిపోయేందుకు ప్రయత్నించే వాళ్లను కిమ్ జోంగ్ ఉన్ గ్యాస్ ఛాంబర్లో తోసేసి శిక్షించేవాడని కథనాలు చదివాం కదా. ఇది అందుకు ఏమాత్రం తీసిపోని విషయం. అందుకే జనాలకు అంతలా తిట్టిపోస్తున్నారు. ‘చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండేవి కావు’.. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. కానీ, చావును సైతం చెప్పుచేతుల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?. ప్రత్యేక చట్టాలు అనుమతితో కారుణ్య మరణాలు కొనసాగుతున్న వేళ.. విమర్శలెన్ని వినిపించినా ‘తగ్గేదే లే’ అంటున్నాయి కొన్ని దేశాలు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నొప్పి లేకుండా కేవలం నిమిషాల్లో.. అదీ ప్రశాంతంగా చనిపోవచ్చంటూ ప్రత్యేక క్యాప్సూల్స్ వాడకానికి అనుమతులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. సార్కో క్యాప్సూల్గా పిలిచే ఈ పేటికలను లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడమే అసలు ప్రత్యేకతలు. ఈ ప్యాడ్లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్ బటన్ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్ లెవల్ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్ డై యాక్సైడ్ లెవల్ తక్కువ కావడం(hypocapnia) ద్వారా మరణం సంభవిస్తుంది. క్యాబిన్లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ ఫిలిప్ నిట్స్చెకే. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్, డాక్టర్ డెత్గా పేరున్న ఫిలిప్ నిట్స్చెకే ఈ క్యాప్సుల్ను రూపొందించాడు. చట్టబద్ధత ఉంది! అసిస్టెడ్ సూసైడ్కు స్విట్జర్లాండ్లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు కూడా(ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు). అదీ లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతి ఆత్మహత్యలకు వుసిగొల్పేలా ఉందంటూ ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ స్విస్ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇప్పటికే రెండు మోడల్స్ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్ టైప్. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం అందించే ఉద్దేశంతో రాయబడింది -
ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. మొబైల్ సిమ్ కార్డుల జారీకి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆధార్ తప్పనిసరన్న సెక్షన్ 57ని సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తే ..
న్యూఢిల్లీ: పందెం, జూదంను చట్టబద్ధం చేస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు వాటికి అలవాటు పడే అవకాశం ఉందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్వీర్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు. తత్ఫలితంగా నేరాల సంఖ్య పెరిగిపోతుందనీ, సమాజం గాడి తప్పుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆలిండియా గేమింగ్ సమిట్–2017’లో జస్టిస్ బల్వీర్ మాట్లాడారు. ‘దేశంలో నాలుగింట ఒక వంతు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వారి ఆదాయం చాలా తక్కువ. జూదం, బెట్టింగ్కు వారు ఆకర్షితులు అయ్యే అవకాశాలు పుష్కలం. అదే జరిగితే పర్యవసానాలు మొత్తం సమాజంపై పడతాయి. ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేరాలు, హింస పెరుగుతాయి’ అని ఆయన వివరించారు. దేశంలో క్రికెట్ పందేలను చట్టబద్ధం చేసే అంశాన్ని న్యాయ కమిషన్ పరిశీలిస్తోంది. -
చట్టబద్ధంగానే థియేటర్ల లీజు: ఎగ్జిబిటర్లు
రాంగోపాల్పేట్: గత విధానాల వల్ల థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోవడంతోనే..థియేటర్లను చట్టబద్ధంగా లీజుకు ఇచ్చామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ విభాగం స్పష్టం చేసింది. శనివారం ఫిల్మ్ చాంబర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిటర్స్ విభాగం చైర్మన్ బాలగోవింద్రాజ్, ఫిల్మ్ చాంబర్స్ అధ్యక్షులు విజయేందర్రెడ్డి, పలువురు థియేటర్ల యజమానులు మాట్లాడారు. గతంలో థియేటర్లో సినిమాలు వేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు ఫిక్స్డ్ హయ్యర్, షేర్ గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ పేరిట భారీగా అడ్వాన్సులు వసూళ్లు చేసేవారని తెలిపారు. ఈ విధానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందల సంఖ్యలో థియేటర్లు మూతలు పడ్డాయని చెప్పారు. గతంలో అడ్వాన్సులు తీసకున్న పంపిణీదారులు సినిమా ఆడకపోతే మళ్లీ ముఖం చూపించకుండా వెళ్లేవారని తర్వాత సినిమా కూడా తమకు ఇవ్వకుండా తప్పించుకునే వారని వాపోయారు. లీజు విధానం లేకపోతే ఇప్పుడున్న థియేటర్లలో ఇంకా చాలా మూతపడేవన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, త్వరగా తీసేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అగ్రిమెంట్ ప్రకారమే సినిమా నడిపిస్తారని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్స్ విభాగం ఉపాధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల నిరాహారదీక్ష చేపట్టిన రామకృష్ణగౌడ్కు సినిమా ఫీల్డ్పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. గత పదేళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదని, వ్యక్తిగత ప్రచారం కోసం ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. సమావేశంలో మల్లారెడ్డి, జగన్, పలువురు లీజుదారులు, థియేటర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.