breaking news
kondapur mandal
-
తరలిపోతున్న గుట్టలు
ప్రభుత్వ ఆదాయానికి గండి పట్టించుకోని రెవెన్యూ అధికారులు కొండాపూర్: ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కొందరు అక్రమార్కులు భూములను కొల్లగొట్టుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పగలు,రాత్రీ తేడా లేకుండా జేసీబీ,ఇటాచీల సహాయంతో గుట్టలను కరిగిస్తూ తద్వారా వాటి ఉండి లభించే రాయి, మట్టిలను మండల పరిధిలోని పరిశ్రమలకు యథేచ్ఛగా అమ్ముకుంటునా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామ శివారులో కొన్ని నూతన పరిశ్రమలు నిర్మాణ దశలో వున్నాయి.వీటి నిర్మాణానికి ఉపయోగపడే రాళ్లు, మట్టిలను కొందరు అక్రమార్కులు గొల్లపల్లి, మాందాపూర్, గుంతపల్లి తదితర గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లోని గుట్టలను కరిగిస్తూ అమ్ముకుంటున్నారు. సుమారు 25 ట్రాక్టర్ల ద్వారా ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ ప్రతీరోజు యథేచ్ఛగా రాయి దందాను కొనసాగిస్తున్నారు.దీని ద్వారా ఒక్కొక్క ట్రిప్పుకు సుమారు 1500 నుండి రెండువేల రూపాయల వరకు తీసుకుంటూ భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇది నిలువరించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం మాముళ్ల మత్తులో పడి కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. -
అధ్వానంగా అంతర్గత రోడ్లు
కొండాపూర్: గ్రామాల్లోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే చాలు కాలు వేస్తే తీయలేని పరిస్థితి. రోడ్ల పైనే మురుగు కాల్వలు ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు లేరు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అంతర్గత రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. తొగర్పల్లి, కొండాపూర్, మల్కాపూర్, గంగారం, అనంతసాగర్, కోనాపూర్, మునిదేవునిపల్లి, మల్కాపూర్ మదిర గ్రామమైన కుతుబ్షాహీపేట్, మారేపల్లి తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే పెద్దాపూర్ నుండి అనంతసాగర్ వరకు వేసిన డబుల్రోడ్డు, తొగర్పల్లి ప్రధాన రహదారి సైతం పూర్తిగా గుంతలమయమైందని వాహనదారులు పేర్కొంటున్నారు. కుత్బ్షాహీపేట్, మునిదేవునిపల్లి, మారేపల్లి గ్రామాల్లో అంతర్గత, కచ్చా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. వర్షం పడడంతో కాలు వేస్తే తీయలేని పరిస్థితి.రాత్రివేళ్లలో నడవడానికి చాలా కష్టంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన కొండాపూర్లోనూ అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మారేపల్లి, అలియాబాద్, గంగారం గ్రామాలలో మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో ఇళ్ల ముందు నుండే మురుగు నీరు ఏరులై పారుతోంది. దీంతో దోమలు, ఈగలు ప్రబలి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం కాల్వల నుండి మురుగు తీసేవారే కరువయ్యారనీ పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీగా మార్చాలంటున్నారు.