సీఎంగారి మనవడి బర్త్డేకి రారండోయ్..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకల నిర్వహణకు కలెక్టర్లు సహా అధికార యంత్రాగాన్ని వాడుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడలోని కస్తూరి గార్డెన్స్లో శుక్రవారం సాయంత్రం దేవాన్ష్ మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. అయితే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీడీపీ నేతలకు రెవెన్యూ అధికారులే స్వయంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. మనవడి పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు కుటుంబం, టీడీపీ ఘనంగా చేసుకోవడం లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అదేదో రాష్ట్ర పండుగలా వేడుకల బాధ్యత అధికారులకు అప్పగించారు.
ఇది విజయవాడలోని అధికారుల వరకే పరిమితం కాలేదు. జిల్లాల్లో ఉన్న టీడీపీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వాన పత్రికలు పంపాలని నిర్ణయించి.. ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించడం విస్మయపరుస్తోంది. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆహ్వాన పత్రికల పార్సిళ్లు అందాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి నేతలకు ఆర్డీవో స్థాయి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులకు తహశీల్దార్లు, ఎంపీడీవో స్థాయి అధికారులు స్వయంగా ఆహ్వాన పత్రికలు తీసుకువెళ్లి అందజేయాలని స్పష్టం చేశారు.
ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ స్థాయి నేతలకు కలెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ సమాచారంతో కలెక్టర్లతోపాటు యావత్ అధికార యంత్రాంగం అవాక్కయ్యింది. చేసేదేమీ లేక గురువారం ఉదయం నుంచి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసే పనిలో పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా తదితర జిల్లాల్లో ఆర్డీవోలు స్వయంగా ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు తెలిసింది.
ఆధునిక పోకడలతో విద్యుత్ ఆదా: సీఎం
విజయవాడ : ఆధునిక పోకడలతోనే ఇంధన పొదుపు సాధ్యమని సీఎం చంద్రబాబు ఉద్భోదించారు. విజయవాడలో ఇంధన పొదుపు సదస్సును సీఎం గురువారం ప్రారంభించి ప్రసంగించారు.
రైతులకు ఇంధన సామర్థ్య పంపుసెట్లు
రైతుల కోసం ఇంధన సామర్థ్య పంపుసెట్లు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్ను రిమోట్గా ఉపయోగించి ఇంటి నుంచే పొలంలోని మోటార్ను ఆన్, ఆఫ్ చేసుకునే టెక్నాలజీతో వీటిని తయారు చేశారు. గురువారం జరిగిన అంతర్జాతీయ ఇంధన పొదుపు సదస్సుకు హాజరైన సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో సీఎం సెల్ఫోన్ బటన్ నొక్కగానే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఈస్ట్మానుగూడెం గ్రామరైతు పొలంలోని పంపుసెట్ ఆన్ అయ్యింది.