breaking news
dy cm
-
సీఎం గహ్లోత్, డిప్యూటీ పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నేత అశోక్ గహ్లోత్(67), యువ నేత సచిన్ పైలట్(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్ గహ్లోత్ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్కు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ తెరదించారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్ చేరుకుని గవర్నర్ కల్యాణ్సింగ్తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్ పైలట్ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే కామెంట్ను ట్విట్టర్లో ఉంచారు. మద్దతుదారుల ఆనందోత్సాహాలు సీఎంగా అశోక్ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్ పైలట్లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్ మద్దతుదారులు జైపూర్లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింధియా తిరస్కారం.. సచిన్ అంగీకారం మధ్యప్రదేశ్, రాజస్తాన్ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్ను మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్ హయాంలో శివ్ చరణ్ మాథుర్ సీఎంగా ఉండగా గహ్లోత్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ కట్టప్ప.. గహ్లోత్! రాజస్తాన్ కాబోయే సీఎం గహ్లోత్ కాంగ్రెస్కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్ గాంధీ. ఆయనను రాజస్తాన్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ చంద్రగుప్తుడయితే గహ్లోత్ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్ సత్సంబంధాలు నెరపారు. ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్సభ ఎన్నికల వరకు గహ్లోత్ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్ అనుకున్నారు. ‘పైలట్’కు కోపైలట్ బాధ్యతలు జైపూర్/న్యూఢిల్లీ: డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్ పైలట్(41)!. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కొడుకైన సచిన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్గానూ పనిచేశారు. 2013లో రాజస్తాన్లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్ విజయంతో పైలట్ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు. -
కేపీసీసీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర సంపన్న దళిత కుటుంబంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు కూడా చదివారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కష్టకాలంలోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2010 అక్టోబరులో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై బుధవారంవరకూ నిరంతరాయంగా కొనసాగి ఆ పదవిలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా రికార్డులకెక్కారు. తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూనే మృదువుగా మాట్లాడగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అనంతరం ఆస్ట్రేలియాలోని వైటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబం స్థాపించిన విద్యాసంస్థలకు పరిపాలనాధికారిగా పనిచేశారు. 1989లో పరమేశ్వర గురించి తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే ఏడాది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో 55.8 వేల ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి పొందారు. 2013లో ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా పరమేశ్వర అనూహ్యంగా ఓడిపోయారు. -
వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
– ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్): వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ.. వేతన సంఘం సిఫారసులను అమలు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు మాట్లాడారు. మహాసభల్లో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. గోరంట్లప్ప, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మౌలాలి, మధు సూధన్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తికొండను రెవిన్యూ డివిజన్ చేస్తాం
–డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కృష్ణగిరి: డోన్తోపాటు పత్తికొండను రెవెన్యూ డివిజన్గా చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండల పరిధిలోని మన్నెకుంట, ఎస్హెచ్ఎర్రగుడి గ్రామాల్లో సోమవారం జరిగిన జనచైతన్యయాత్రల్లో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. డోన్ రెవిన్యూ డివిజన్లో పత్తికొండను కలుపకుండా పత్తికొండనే రెవిన్యూ డివిజన్ తప్పక చేస్తామన్నారు. పొదుపు సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, కేఈ శ్యాంబాబు, ఎంపీపీ సుంకులమ్మ, జడ్పీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. -
దొంగ యుద్ధానికి దిగుతున్నారు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో సైనికులపై జరుగుతున్న వరుసదాడుల వెనకాల కుట్ర ఉందని, పొరుగు దేశం(పాకిస్థాన్) దొంగ దెబ్బతీస్తూ పరోక్ష యుద్ధానికి దిగుతోందని ఆరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ విషయంపై తాము కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలతో కూడిన అమర్ నాథ్ యాత్రకు ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో తృప్తి చెందని ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా శాంతి భధ్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమర్ నాథ్ యాత్ర రెండు నెలల్లోముగుస్తుందని కానీ రాష్ట్రంలో ముఖ్యంగా బార్డర్లో నివసిస్తున్నప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితిపై మౌనంగా ఉండటం సరికాదన్నారు. చొరబాటుదారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పనితీరుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు'
హైదరాబాద్ : ఈ ఏడాది వేసవిలో జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి అన్ని జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ డైరీ, క్యాలెండర్ను కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం కడియం మాట్లాడుతూ... ఇంటర్ బోర్డుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా అన్ని సేవలను ఆన్లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 3,678 కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. -
'డిప్యూటీ సీఎం కడియం మోసం చేస్తున్నారు'
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ డిసెంబర్ 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ విలేకర్లతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ పేరుతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాల మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి న్యూఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ... రైతులను మోసం చేసింది టీడీపీ, బీజేపీలే అని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మావోయిస్టులను పిట్టల్లా కాల్చిన ఘనత కాంగ్రెస్దేనంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణనే కావాలని తాము కోరుకుంటున్నట్లు కడియం తెలిపారు.