breaking news
durgastami
-
దసరా నవరాత్రులు.. సర్వం శక్తిమయం
దసరా నవరాత్రులు ఏటా శరదృతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజులూ ఆరాధిస్తారు గనుక దేవీ నవరాత్రులని అంటారు. హరిహరబ్రహ్మేంద్రాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించింది. మహిషాసురునితో తొమ్మిది రోజుల హోరాహోరీ యుద్ధం తర్వాత మహిషాసురుడిని సంహరించింది. లోకానికి మహిషాసురుని పీడ విరగడైనందుకు ఆశ్వీయుజ శుద్ధ దశమిని విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమైనది శక్తి మాత్రమేనని నమ్ముతారు. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’ నవరాత్రులలో అమ్మవారిని శక్తిస్వరూపంగా తలచి స్తోత్రపాఠాలతో వేడుకగా పూజలు జరుపుతారు. పురాణగాథల ప్రకారం మహిషాసుర సంహార ఘట్టం సంక్షిప్తంగా... మహిషాసురుడు అసురులలో మహా బలసంపన్నుడు. ఎంతటి బలసంపన్నుడికైనా ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడానికి మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దుర్గాదేవి అవతరణ పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తుల దివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు. వైవిధ్యభరితంగా వేడుకలు దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు. రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు. ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. దసరా రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరుగంటల వరకు జరిగే ఈ వేడుకలు తూపుచెరువు కట్ట వద్దకు చేరుకోవడంతో ముగుస్తాయి. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రిటిష్కాలంలో బుందేల్ఖండ్ నుంచి ఇక్కడకు వచ్చిన సైనికుడు ఒకరు అప్పట్లో బందరులోని ఈడేపల్లిలో కాళీమాతను ప్రతిష్ఠించాడు. దసరా నవరాత్రుల్లో ఇక్కడి నుంచి శక్తిపటాన్ని ఊరేగింపుగా వీధుల్లోకి తీసుకు రావడం ఆచారంగా వస్తోంది. వీధుల్లోకి వచ్చినప్పుడు జనం తమ తమ మొక్కుబళ్లను చెల్లించుకుంటారు. దసరా రోజున వీరనృత్యం చేస్తూ రాక్షసవధను అభినయిస్తారు. తర్వాత కోనేరు సెంటరు వద్ద జమ్మి కొట్టడంతో వేడుకలు ముగుస్తాయి. ఒంగోలులో దసరా వేడుకల సందర్భంగా కళారాలను ఊరేగిస్తారు. భారీ ముఖాకృతులనే ‘కళారా’లని అంటారు. కాళికాదేవి, మహిషాసురమర్దిని, నరసింహస్వామి వంటి దేవతా ఆకారాలతో కళారాలను ముందుగానే సిద్ధం చేస్తారు. వీటిని బండి మీదకు ఎక్కించి, ఇటూ అటూ ఊపేందుకు వీలుగా కొయ్యలకు కడతారు. కళారాల వెనుక కళాకారులు ఉంటారు. డప్పుల మోతకు అనుగుణంగా కళాకారులు ఉగ్రంగా కళారాలను ఊపుతూ వీరనృత్యం చేస్తారు. కళారాలను ఊరి నడిబొడ్డుకు తీసకువచ్చాక, అక్కడ రాక్షస సంహారాన్ని అభినయిస్తారు. ఈ ఏడాది ‘కరోనా’ మహమ్మారి కారణంగా పండుగలన్నీ కళ తప్పాయి. ఏటా ఆనవాయితీగా జరిగే స్థాయిలో ఈసారి దసరా నవరాత్రులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. బహిరంగ వేడుకల అట్టహాసం, వీధుల్లో సంబరాలు జరుపుకోవడం వంటివేవీ లేకపోయినా, దేశవ్యాప్తంగా గల శక్తిపీఠాలు, దేవీ ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. నవదుర్గల ఆరాధన శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. ఆడపడుచులు ఈ వేడుకలను కన్నవారిళ్లలో జరుపుకోవడం ఆనవాయితీ. -
సద్దులు.. పాటల సుద్దులు
సాక్షి, కరీంనగర్: ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ప్రత్యేక పండుగ లేదు. కానీ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆ లోటును పూడ్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన రాష్ట్రం వేదిక. పండుగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. ఏడాదికోసారి ఆడబిడ్డలు తమ కష్టాలు, బాధలను మరిచి, ఆనందంగా గడిపే సమయమిది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత వారం రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. గునుగు పూలు తెలుగు లోగిళ్లలో సందడి... తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ సందడిగా మారుతాయి. పండుగ సందర్భంగా అత్తవారింటి నుంచి తమ ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన మహిళలు, యువతులు ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. మధ్యాహ్న సమయానికి అన్నదమ్ములు తీసుకుచ్చిన పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, పూజ చేస్తారు. చివరి రోజు రెండు బతుకమ్మలు తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పుడు తోడు పెళ్లికూతురుగా మరొకరని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మకూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి, పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు. చామంతి పూలు పిండి పదార్థాలకు ప్రత్యేకత.. వానకాలం ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే సమయంలో వచ్చే సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేందుకు పిండి పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పెసలు, బియ్యం పిండితో సత్తు, పులిహోర, పెరుగన్నం తదితరాలు సిద్ధం చేస్తారు. ఇవన్నీ వాతావరణం మార్పునకు లోనైన సమయంలో మానవ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే ఔషధీయ విలువలను కలిగి ఉంటాయి. బతుకమ్మల నిమజ్జనం తర్వాత ఈ పిండిపదార్థాలను మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక బడ్జెట్తో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం సర్కారు చాలా చోట్ల బతుకమ్మ ఘాట్లను నిర్మించింది. ఇదీ పండుగ నేపథ్యం.. తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం విస్తరించిన బతుకమ్మ పుట్టుక వెనక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు న్నాయి. పూలను బతుకుగా భావించి, మహిళలు పూబొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మ అనే పేరు వచ్చిందని భావన. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి, పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అనేది ఒక నేపథ్యం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తన తలపై పెట్టుకున్న గంగను చూసి, పార్వతి అసూయ పడుతుంది. గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి, పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతతరం చెందిందని కూడా చెబుతారు. పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషం కలిపి, మరదలికి తాగించి చంపుతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని ఊరి బయట పాతి పెడుతుంది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూస్తుంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని తెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు నీకు ఏం కావాలో కోరుకొమ్మంటే ఈ తంగెడు పూలల్లో నన్ను చూసుకోమని, ఏటా నా పేర పండుగ చేయండని అంటుంది. ఇలా ఈ పండుగ ప్రారంభమైనట్లు మరో కథ. చాలా కాలం కిందట సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి, పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేస్తుంది. దీంతో మహిళలు ఆమె చుట్టూ చేరి, దైవ స్వరూపంగా భావించి, పూజలు చేస్తారు. ఇది క్రమంగా బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు కారణమైందని ఇతిహాసం. మరో కథలో ఓ దంపతులకు కలిగిన పిల్లలు కలిగినట్లుగా మరణిస్తుంటే పార్వతిని ప్రార్ధించారట. ఆమె దయతో ఒక కూతురు కలిగి, బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని ప్రతీతి. తీరొక్క పూల కూర్పు ‘బతుకమ్మ’ మహిళలు గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింట తదితర పూలతో గోపురం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. దాని పైభాగంలో గౌరీదేవికి ప్రతిరూపమైన గుమ్మడి పువ్వు, పసుపు ముద్దలను ఉంచుతారు. అనంతరం అగర్బత్తీలు, ప్రమిదలు వెలిగించి, వీధుల కూడళ్లకు తీసుకెళ్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చుతారు. పాట తెలిసిన పెద్దావిడ ఒకరు బతుకమ్మ పాటను ఆలపిస్తే మిగిలిన వాళ్లంతా ఆమెను అనుసరిస్తూ గొంతు కలుపుతారు. బతుకు పాటలు, శ్రమజీవుల వెతలు, గౌరీదేవి మహత్యం, పతివ్రతల ఇతివృత్తాలు ప్రధానాంశాలుగా బతుకమ్మ పాటలు పాడుతారు. అర్ధరాత్రి వరకు ఆడిపాడి, సమీపంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. కరీంనగర్లో నిమజ్జన ప్రాంతాలు నగరంలోని మానేరు వాగు బ్రిడ్జి సమీపంలోని వేద పాఠశాల వద్ద, రాంచంద్రపూర్ కాలనీలోని మానేరు డ్యాం, కొత్తపల్లి చెరువు, కిసాన్నగరలోని గర్లకుంట, చింతకుంట కాలువ వద్ద బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
17న ఎంగిలిపూల బతుకమ్మ
సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. దీన్ని తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహిత సంఘం బాధ్యులు మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ‘కుడా’ గార్డెన్స్లో సమావేశమయ్యారు. పండుగల నిర్వహణపై చర్చించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య (పితృ అమావాస్య) రోజున ఎప్పటిలాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతో పాటు అదేరోజు ఆనవాయితీ ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. నెల రోజుల తర్వాత అక్టోబర్ 17వ తేదీ శనివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తిథి మొదలు 8 రోజుల పాటు బతుకమ్మ ఆడుకొని అదే నెల 24వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలన్నారు. గతంలో 1963, 1982, 2001ల్లో కూడా ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని ఈ సందర్భంగా పండితులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పురోహిత సంఘం రాష్ట్ర కన్వీనర్ తాండ్ర నాగేంద్రశర్మ, పండితులు ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, తాండ్ర పిచ్చయ్యశాస్త్రి, వెలిదె యుగేందర్శర్మ, డాక్టర్ ప్రసాద్శర్మ, మరిగంటి శ్రీకాంతాచార్య, డింగరి వాసుదేవాచార్యులు, గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, గంగు సత్యనారాయణశర్మ, డాక్టర్ శేషభట్టార్ వెంకటరమణాచార్యులు, మెట్టెపల్లి హరిశర్మ, పీతాంబరి శ్రీకాంతాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు
-
9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి
శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని పులివాహనంపై కత్తి, త్రిశూలం చేబూని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దుర్గాష్టమి రోజున దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం. శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!! భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు. ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు. నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం