breaking news
chodavaram constituency
-
ధర్మశ్రీ చతురత!
చోడవరం: జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్లో నూతనుత్సాహాన్ని నింపింది. రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. -
చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజుకు అసమ్మతి సెగ
-
రాజా చేయ్యి వేస్తే...
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం చోడవరంలో టీడీపీ నేత మైనింగ్ దందా అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత అడ్డొస్తే అంతే సంగతులు.. పోలీసులతో వేధింపులు ప్రజల బాగోగులు గాలికి.. ఆయన ఆర్జన ఆకాశానికి ఏ మాటకా మాటే చెప్పాలి.. చోడవరంలో టీడీపీ కీలక నేత రూటే సెపరేటు.. ఆమాం బాపతు చిల్లర వసూళ్లు.. పైసా వసూల్ పంచాయితీలు ఆయనగారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎంతైనా.. నియోజకవర్గానికి రాజులాంటోరు కదా.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నదే ఆయనగారి సిద్ధాంతం.. అందుకే ఏకంగా కొండలు, గుట్టలను మింగేసే పనిలో పడ్డారు.. కొండలంటే.. అలాంటిలాంటివి కావు.. కోట్ల విలువ చేసే నిక్షేపాల కొండలు.. గ్రానైట్, క్వార్ట్జ్లాంటి విలువైన నిక్షేపాలున్న కొండలను గుర్తించడం.. వాటిని కొల్లగొట్టడం.. ఇదే ఆయనకు నిత్యకృత్యం. అలా రూ.కోట్లకు కోట్లు కూడబెట్టి ఖజానా నింపుకొంటున్నారు.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇదే దందా సాగించిన ఆయనగారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో మరింత రెచ్చిపోయారు. అడ్డూఅదుపూ లేకుండా కొండలను కరిగించేస్తున్నారు. రవ్వంత మైనింగ్ అనుమతులు తీసుకుని.. కొండంతా తవ్వేసుకోవడం.. లీజులను అమ్మేసి గుడ్విల్ దండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. క్వారీల తవ్వకాలకు పరిసర ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అధికారం అడ్డుపెట్టుకుని కేసుల పేరుతో బెదిరించి అడ్డు తప్పిస్తారు.. ప్రజా సమస్యలను లేశమాత్రమైనా పట్టించుకోకుండా.. క్వారీయింగ్ కింగ్ అనిపించుకోవడమే లక్ష్యంగా.. అలా ముందుకు సాగుతున్న ఈ టీడీపీ కీలక నేత నిర్వాకాలెలా ఉన్నాయో.. ఒక్కసారి వీక్షిద్దాం రండి.. విశాఖతీరానికి.. జిల్లాలో గ్రానైట్ కింగ్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది చోడవరంలోని టీడీపీ కీలక నేత పేరే. కొండ కనిపిస్తే చాలు.. ఒక బిడ్ వేసి కొండ మొత్తం తొలిచేసి.. కాసులుగా మార్చుకోవడం.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేది టీడీపీ శ్రేణులే అంగీకరించే వాస్తవం. మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈయనకు క్వారీలు ఉన్నాయి. కొన్ని స్వయంగా ఆయన పేరిటే ఉండగా, మిగిలినవాటిని బినామీ పేర్లతో నడిపిస్తుంటారు. ముందుగా తన సొంత సర్వేయర్లతో సర్వే చేయించుకొని విలువైన రాయి ఉన్న కొండలను గుర్తిస్తారు. వెంటనే అక్కడ మైనింగ్కు దరఖాస్తు పడేస్తారు. తన హోదాను ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చేసుకుంటారు. ఆనక నచ్చితే స్వయంగా మైనింగ్ చేయడం.. లేదంటే సదరు లీజు హక్కులను భారీమొత్తానికి అమ్మి సొమ్ము చేసుకోవడం జిల్లావ్యాప్తంగా ఈయనొక్కరికే చెల్లిన వ్యాపారం. అనుమతి 15 హెక్టార్లు.. తవ్వకం 25 హెక్టార్లు తక్కువ విస్తీర్ణానికి లీజు పొందడం.. దాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం ఈయనగారి సిద్ధాంతం. వమ్మలి జగన్నాధపురంలో ఉరలోవ కొండ గ్రానైట్ క్వారీలో సదరు నేతకు ప్రధాన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ 15 హెక్టార్లలో మైనింగ్కే అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు 25 హెక్టార్లకు పైనే అక్రమంగా క్వారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ క్వారీ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను తక్కువ ధరకే దక్కించుకొని బినామీల పేరున పెట్టారు. క్వారీకి రోడ్డు వేసేందుకు భూములు ఇవ్వాలని అడగ్గా కొందరు రైతులు నిరాకరించారు. దీంతో వారిని బెదిరించి మరీ రోడ్డు వేయించారు. క్వారీలే.. క్వారీలు కోటవురట్ల సమీపంలో ఈయన పేరిటే ఓ క్వారీ నడుస్తోంది. తోటకూరపాలెం, గుడ్డిప క్వారీల్లో కొంత భాగస్వామ్యం ఉన్నట్టు సమచారం. కొట్నాబిల్లి గ్రానైట్ క్వారీని తన కుటుంబ సభ్యుల పేరిట కొంత కాలం నిర్వహించారు. ఇటీవలే స్లీపింగ్ పార్టనర్గా మారి మరొకరికి లీజు హక్కులు అమ్మేశారు. టి.అర్జాపురం డోలన్నపాలెం, అజయ్పురం, జెడ్.బెన్నవరంక్వారీలకు అనుచరుల పేరిట లీజు పొంది.. తర్వాత చెన్నై, హైదరాబాద్లకు చెందిన బడా వ్యాపారులకు అమ్మేసుకున్నట్టు తెలిసింది. ఇవే కాకుండా పొరుగు జిల్లాల్లోనూ క్వారీలు ఉన్నట్టు తెలుస్తోంది. గ్రానైట్, క్వార్ట్జ్, ఇతర గనుల క్వారీ వ్యాపారం చేసే యజ మానులందర్నీ వడ్డాది కేంద్రంగా అప్పుడప్పుడు సమావేశపరుస్తుంటారు. రాజకీయంగా అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ మైనింగ్ కింగ్ అనిపించుకోవడానికి సదరు నేత ఉబలాటపడిపోతుంటారట. అడ్డగోలు రవాణాతో రోడ్లు ధ్వంసం నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై పెద్దపెద్ద గోతులు పడిపోవడానికి, బొడ్డేరు వంతెన కూలిపోవడానికి, వడ్డాది, తాచేరు, గోవాడ, వంతెనలు శిథిలమవ్వడానికి సదరు నేత క్వారీల నుంచి లారీల్లో భారీగా తరలిస్తున్న గ్రానైట్ రాళ్లే కారణమనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయమై ముఖ్యమంత్రి మొదలు జిల్లా కలెక్టర్ వరకు అనేకసార్లు ఆయా ప్రాంతాల వారు ఫిర్యాదులు పంపించారు. కానీ మైనింగ్ కింగ్ దందాకు మాత్రం ఎవ్వరూ అడ్డుకట్టవేయలేకపోయారు అనేకంటే అసలు పట్టించుకోలేదనడమే సమంజసం. అడ్డొస్తే... అంతే సంగతులు క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్ల కారణంగా పెద్దపెద్ద రాళ్లు పొలాల్లో పడి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆందోళన చేస్తే చాలు.. ఆయన ఆగ్రహోదగ్రుడై పోతారు. అధికారం అడ్డుపెట్టుకుని పోలీసులను ప్రయోగించి ఆందోళనకారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటారు. ఈయన పేరిటే ఉన్న ఎరుకవాడ క్వారీతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఉద్యమిస్తే.. పోలీసులతో ఉక్కుపాదం మోపి ఆందోళనకు అడ్డుకట్ట వేశారు. ఇటీవలే ఈ క్వారీని నెలకు రూ.లక్ష చొప్పున గుడ్విల్ ఇచ్చే ఒప్పందంతో వేరొకిరి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక తాయిలాలతో గ్రామాల్లో కొందరికి ఎర వేసి ఊళ్లో తగాదాలకు కూడా ఆజ్యం పోస్తుంటారు. బిడ్ వేసిన కొండ పరిసర గ్రామాల్లో నివసించే వారిలో ఒకరిద్దరిని డబ్బు ఆశ చూపి తన మనుషులుగా మార్చుకుంటారు. ఆయా గ్రామాల నుంచి మైనింగ్కు అభ్యంతరాలు రాకుండా.. సదరు వ్యక్తుల ద్వారా కథ నడిపిస్తారు. అదేవిధంగా కొండకు ఆనుకొని ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వీరి ద్వారానేలావాదేవీలు నడిపేస్తుంటారు.