breaking news
Chicken leg piece
-
60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్లను మింగేసింది
చికెన్ తినే పోటీ అనగానే నిమిషంలో కోడిని మొత్తం లాగించే వారిని మీరు చూసి ఉంటారు.. కానీ కేవలం చికెన్ కాళ్లు తినే పోటీని మీరెప్పుడైనా చూశారా? ఉడకబెట్టిన కోడి కాళ్లను.. అది కూడా నిమిషం వ్యవధిలో తినే పోటీ గురించి విన్నారా? ఎందుకంటే ఎముకలతో కూడిన కోడి కాళ్లను తినడం అంటే మామూలు విషయం కాదు. వాటిని కాల్చిన పద్ధతిని బట్టి రుచి మారుతుంది. అలాంటిది దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్ అనే యువతి కేవలం 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెల కొల్పింది. డర్బన్లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్ప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది. పోటీలో పాల్గొన్న ఐదుగురిలో ఒక యువతి కోడి కాలును నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడ్నుంచి లేచి వెళ్లిపోగా సిమనైల్ మాత్రం ఎటువంటి తత్తరపాటుకు లోనుకాకుండా వాటిని ఆరగించేసింది. ఈ పోటీ స్టంబో రికార్డ్ బ్రేకర్స్ అనే చానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
అమ్మో ! అమెరికా ‘కోళ్ల కాళ్లు’ నడిచొస్తున్నాయ్
సాక్షి, న్యూఢిల్లీ : ‘అమెరికన్ చికెన్ లెగ్స్ సూన్ బీ వాకింగ్ ఇన్ టూ ఇండియన్ స్టోర్స్ (అమెరికా కోళ్ల కాళ్లు త్వరలో భారతీయ షాపుల్లోకి నడిచి వస్తాయి)’ సరదాగానో, ఆందోళనతోనో చేసిన ఈ వ్యాఖ్య త్వరలో నిజం కాబోతోన్నది. శీతలీకరించిన కోళ్ల కాళ్ల కంటేనర్ను భారత్కు షిప్పింగ్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం నుంచి తొలి పర్మిట్ను దక్కించుకున్న ‘యూఎస్ఏ పౌల్ట్రీ అండ్ ఎగ్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్’లో సభ్యత్వం కలిగిన అమెరికాలోని ‘గ్లోబల్ ఇంటర్నేషనల్’ కంపెనీ ప్రకటించింది. కోళ్ల కాళ్ల (చికెన్ లెగ్స్)ను అమ్మేందుకు గత దశాబ్దకాలంగా అమెరికా కంపెనీలు చేస్తున్న పోరాటాన్ని మన భారతీయ కోళ్ల పరిశ్రమలు అడ్డుకుంటు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గతేడాది జూలై నెలలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లూటీఓ) ముందు భారత్ ఓడిపోయింది. ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు దాటిన భారతీయ కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు అమెరికా నుంచి కోళ్లు, ముఖ్యంగా కాళ్లు దిగుమతిని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకు భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థరహితమంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ గతేడాది నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. దిగుమతులను అనుమతించేందుకు సరైన మార్గదర్శకాలతో ముందుకు రావాల్సిందిగా ఆదేశిస్తూ 18 నెలల గడువును ప్రసాదించింది. ఈ గడువు మరో తొమ్మిది నెలలు ఉండగానే ప్రభుత్వం మొదటి పర్మిట్ను ఎందుకు జారీ చేసిందో తెలియదు. అమెరికా నుంచి కోళ్ల కాళ్లను అనుమతించాలనుకుంటే కఠినమైన నిబంధనలను అమలు చేయాలంటూ ‘పౌల్ట్రీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు రమేశ్ ఖత్రి ఇటీవలనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. శీతలీకరించిన కోడి కాళ్లు మూడు నెలల ముందు సంహరించిన కోడిది కాకూడదని, జన్యు మార్పిడి విత్తనాలతో పండించిన మొక్కజొన్న, సోయాను కోళ్లకు ఆహారంగా పెట్టరాదని, జంతువుల కొవ్వు, ముఖ్యంగా పంది కొవ్వును కోళ్లకు దాణాగా వేయరాదని ఆ లేఖలో ఖత్రి సూచించారు. అమెరికాలో కోళ్ల ఎదుగుదల కోసం మొక్కజొన్న, సోయా, పంది కొవ్వునే దాణాగా ఉపయోగిస్తారు. వీటిని వద్దంటే అమెరికా నుంచి దిగుమతులను వద్దనడమే. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం వారం క్రితమే స్పందించి తొలి పర్మిట్ను మంజూరు చేసింది. కోళ్ల కాళ్లే ఎందుకు దిగుమతి? అమెరికా నుంచి ఏ కోళ్ల పరిశ్రమైనా కోడి కాళ్లనే దిగుమతి చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే అమెరికన్లు ఎక్కువగా కోడి బ్రెస్ట్నే తింటారు. కోడి కాళ్లను తినడానికి అసలు ఇష్టపడరు. భారతీయులు కోడి కాళ్లను అమిత ఇష్టంగా తింటారు. ఇందుకు పలు కారణాలు చెబుతారు. తెల్ల అమెరికన్లు కోడిలో తెల్లటి భాగం, అంటే బ్రెస్ట్ను తినడం మొదటి నుంచి అలవాటు చేసుకున్నారట. ఆఫ్రికన్ అమెరికన్లు కాళ్లను తినడం అలవాటు చేసుకున్నారట. అమెరికన్లు ఎవరైనా నైఫ్, ఫోర్క్ ఉపయోగించి తింటారు. వీటి ద్వారా కోడి కాళ్ల నుంచి మాంసాన్ని వేరు చేసి తినడం కొంత ఇబ్బంది. అందుకని వారు వాటిని అంతగా ఇష్టపడరట. కోళ్లలో కొవ్వు ఎక్కువగా కాళ్లలో పేరుకుంటుందని, ప్రొటీన్లు బ్రెస్ట్లో ఉంటాయని ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. ఈ వాదన భారత్లో కూడా ప్రచారంలోకి రావడంతో జిమ్ములకెళ్లే జిమ్మీలు కోడి బ్రెస్ట్నే కోరుకుంటున్నారు. అందుకనే అవకాశం ఉంటే అమెరికన్ రైతులు ‘రెండు బ్రెస్ట్లు ఒక కాలు మాత్రమే ఉండే’ కోళ్లను పెంచుతారన్న మాట పలుకుబడిలో ఉంది. ఇక భారతీయులు ఎక్కువ వరకు చేతులతోనే భోజనం చేస్తారు కనుక కోడి కాళ్లను చేతులతో నోట్లో పెట్టుకొని కరకర నమిలేస్తారు. ‘తంగ్డీ కబాబ్’ పట్టుకుంటే నోట్లో నీళ్లూరడం ఖాయం. అమెరికాలో ఎలాగూ ఎక్కువగా కోళ్ల కోళ్లను తినరు కనుక అక్కడి కోళ్ల పరిశ్రమలు అతి తక్కువ ధరకు భారత్కు దిగుమతి చేస్తాయని, తద్వారా తాము తీవ్రంగా నష్టపోతామని భారతీయ కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడి వేళ్లు చైనాకు.... కోడి కాళ్లను (అంటే పిక్క నుంచి మోకాలి వరకు) మనకు విక్రయించాలనుకుంటున్న అమెరికా కోళ్ల పరిశ్రమలు, కాలి వేళ్లను (మోకాలు నుంచి వేళ్ల వరకు) చైనాకు ఇప్పటికే జోరుగా విక్రయిస్తోంది. కోడి వేళ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయన్నది చైనా ప్రజల వాదన. అందుకనే వాటిని వారు ఎక్కువగా తింటారు. మాంసం, కోడి ఒకటే రేటు ఒకప్పుడు భారత్లో మేక మాంసం, కోడి కూర ఒకటే ధరకు లభించేవి. కోళ్ల పరిశ్రమ బాగా పుంజుకోవడంతో కోడి కూర ధరలు తగ్గుతూ వచ్చాయి. కోళ్లలాగా మేకలను కూడా ఓ పెద్ద పరిశ్రమలాగా (పాశ్యాత్య దేశాల్లోలాగా) భారత్లో పెంచడం లేదు. కారణం మేకల పెంపకానికి పెద్ద స్థలం కావాలి. ఫలితం కోసం చాలాకాలం నిరీక్షించాలి. 1975లో మన దేశంలో ఏటా 26. 90 కోట్ల మేక మాంసం ఉత్పత్తికాగా, పది కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అయ్యేది. 1990 నాటికి మాంసం ఉత్పత్తి 45.80 కోట్ల కిలోలలకు, కోడి కూర 52.70 కోట్ల కిలోలకు చేరుకుంది. అంటే మొదటిసారి మేక మాంసాన్ని కోడి కూర దాటి పోయింది. ప్రస్తుతం దేశంలో 95 కోట్ల కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంటే, 180 కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అవుతుంది. అంటే దేశంలో మేక మాంసం మూడున్నర రెట్లు పెరగ్గా, కోటి మాంసం 18 రెట్లు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి కోడి కాళ్లు దిగుమతి అయితే తమ గతేమికానని కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కిలో కోడి కాళ్ల ధర 200 రూపాయలని, స్థానికంగా కిలో కోడి కాళ్లు 130 రూపాయలని, అంతేకాకుండా శీతలీకరించిన మాంసం కన్నా తాజా మాంసం తినడమే భారతీయులకు ఎక్కువ అలవాటు కనుక కోడికాళ్ల దిగుమతిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. ఈ అడ్డుంకులను దాటుకొని ‘కోడి కాళ్లు మన వంటిట్లోకి నడిచి వస్తాయా’ వేచి చూడాలి. -
చికెన్ లెగ్స్ స్వేచ్ఛా దిగుమతులు వద్దు
కేంద్ర ప్రభుత్వానికి నెక్ వినతి హైదరాబాద్: అమెరికా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా చికెన్ లెగ్ పీసుల దిగుమతికి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిపాదించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై నెక్ ఆందోళన వెలిబుచ్చింది. భారత్ నుంచి బాస్మతి బియ్యం, పండ్లు దిగుమతి చేసుకోవడంతో పాటు ఐటీ నిపుణులకు దోహదపడేలా వలస సంస్కరణలను అమెరికా అమలు చేస్తే చికెన్ లెగ్ పీసుల స్వేచ్ఛా దిగుమతికి అనుమతిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేయడం వల్ల భారత్లోని 50 లక్షల మందికిపైగా పౌల్ట్రీ రైతులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది తీవ్రంగా నష్టపోతారని నెక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతర ఉత్పత్తుల ఎగుమతి కోసం, ఐటీ నిపుణుల ప్రయోజనాల కోసం పౌల్ట్రీ రైతుల జీవితాలను పణంగా పెట్టడం తగదని తెలిపింది. ‘అమెరికా ప్రజలు చికెన్ బ్రెస్ట్ను మాత్రమే అధికంగా తింటారు. లెగ్పీసులకు గిరాకీ అతి తక్కువ. అక్కడ కిలో చికెన్ ధర 4 డాలర్లు, బ్రెస్ట్ మీట్ 7.9 డాలర్లుగా ఉంది. చికెన్ లెగ్స్కు డిమాండు లేకపోవడంతో లెగ్ పీసులను కిలో 40-80 సెంట్ల కంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తారు. చికెన్ బ్రెస్ట్ విక్రయంతోనే అమెరికా పౌల్ట్రీ రైతులకు తగినన్ని లాభాలు వస్తాయి. లెగ్ పీసులంటే దాదాపు వృథాకిందే లెక్క. ఎలాంటి సుంకాలు లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడమంటే దేశీయ పౌల్ట్రీ రంగాన్ని చావుదెబ్బతీయడమే. పౌల్ట్రీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. కానీ భారత్లో మాత్రం పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో చికెన్ లెగ్స్ దిగుమతులపై సుంకాలను తగ్గించవద్దు. అంతేకాదు, దేశీయ పౌల్ట్రీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా చికెన్ లెగ్స్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలి’ అని ప్రభుత్వానికి నెక్ విజ్ఞప్తి చేసింది.