breaking news
Certificate distribution
-
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే యువత శ్రమించాలి
బన్సీలాల్పేట్: లక్ష్యసాధన కోసం అస్త్రాన్ని సంధించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు యువతీ, యువకులు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగా లని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతీ, యువకుల సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చూసిన మీరు ఎంతో ధైర్యంతో ముందుకు సాగాలని యువతకు ఉద్బోధించారు. విద్యావంతులైన యువతకు సాఫ్ట్స్కిల్స్ ప్రాణవాయువు వంటిదనీ, అలాంటి స్కిల్స్లో మరింత సమర్థవంతంగా రాణించినప్పుడే అవకాశాలు వస్తాయని సూచించారు. సమాజంలోని అనాథలను చేరదీయాలని, వారు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే దేశానికి తీరని నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది అనాథలు, నిరుపేదలను చేరదీసి సాఫ్ట్స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావును సాక్షి ఎడిటర్ మురళి అభినందించారు. సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా యశోద ఫౌండేషన్ చిత్తశుద్ధితో సమాజమార్పు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి యశోద ఫౌండేషన్లో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న సోనీ(నిర్మల్), సురేఖ(నాగర్కర్నూల్), స్వాతి(యాదగిరిగుట్ట), రాకేష్, సరిత, స్వాతి, లిడియా, సుమిరాలు మాట్లాడుతూ కూలీ నాలీ చేసుకొని జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చి ఇక్కడి శిక్షణతో ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని వివరించారు. తినడానికి తిండి లేక, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో ఇక్కడ శిక్షణతో ఆత్మవిశ్వాసం, స్కిల్స్తో జీవితంలో స్ధిరపడిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టారు. అనంతరం సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, యశోద ఆసుపత్రి డైరెక్టర్ బాలక్రిష్ణరావుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి డైరెక్టర్ రాజేందర్, డాక్టర్ హరీశ్కుమార్, డాక్టర్ రఘవీర్, ప్రిన్సిపల్ అరుణజ్యోతి, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
AP: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను డిమాండ్ ఉన్నచోట అమ్ముకోగలిగినప్పుడే రైతుకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అసలు పంట పండించడం కంటే మార్కెటింగ్ చేసుకునేందుకు పడే ఇబ్బందులే ఎక్కువ. ఇక ఎగుమతులకైతే చెప్పలేనన్ని ఆంక్షలు. మరోవైపు.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోంది. దీంతో ఎవరికి వారు తమవే ఆర్గానిక్ ఉత్పత్తులంటూ సర్టిఫై చేసుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇప్పటివరకు ఎక్కడా పంటల ధ్రువీకరణకు ప్రత్యేక విధానమంటూ లేకపోవడమే. ఈ నేపథ్యంలో.. గడిచిన రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తోంది. ఓ పక్క సేంద్రియ పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తూనే మరోపక్క పంటల ధృవీకరణ (క్రాప్ సర్టిఫికేషన్)పై దృష్టిసారించింది. చదవండి: విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ సర్టిఫికేషన్ లేకే ఎగుమతులకు దెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో 92.45 లక్షల ఎకరాలు, రబీలో 58.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక 1.19 లక్షల ఎకరాల్లో పట్టు (మల్బరీ), 4.52 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వీటి ద్వారా గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 312.24 లక్షల టన్నుల ఉద్యాన, 8,420 టన్నుల పట్టు, 46.24 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల దిగుబడులు వచ్చాయి. పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం దేశంలోనే నం.1గా ఉంది. కానీ, విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులతో పాటు కొన్నిరకాల ఉద్యాన పంటలకు మాత్రమే క్రాప్ సర్టిఫికేషన్ చేసుకోగలుగుతున్న రైతులను వేళ్లమీద లెక్కించొచ్చు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగుచేస్తున్నామని చెప్పుకుంటున్న వారు సైతం క్రాప్ సర్టిఫికేషన్కు దూరంగానే ఉంటున్నారు. ఎగుమతుల దగ్గరకొచ్చేసరికి సర్టిఫికేషన్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులు జరుగుతున్నట్లుగా తేలింది. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ వ్యవస్థ ఉంటే కనీసం అవి రూ.2వేల కోట్లకు పైగా జరుగుతాయని అంచనా వేసింది. దీంతో వచ్చే రెండేళ్లలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పొలం బడిలో జీఏపీ పద్ధతులను డాక్యుమెంటేషన్ చేస్తోన్న రైతులు రబీ సీజన్ నుంచి జీఏపీ జారీ పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 రబీ సీజన్లో పొలంబడులకు శ్రీకారం చుట్టింది. 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా సత్ఫలితాలను సాధించడంతో 2021–22 సీజన్లో ఆర్బీకేలు కేంద్రంగా పొలంబడి, తోట, పట్టు, మత్స్యసాగు, పశువిజ్ఞాన బడులకు శ్రీకారం చుట్టింది. వీటికోసం ఆయా యూనివర్సిటీల ద్వారా ప్రత్యేక సిలబస్ను రూపొందించారు. 13–14 చాప్టర్స్గా తయారుచేసిన ఈ సిలబస్పై తొలుత ఆర్బీకే సిబ్బందికి శిక్షణనిచ్చారు. వీటి ద్వారా ఎంపిక చేసిన క్షేత్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లలో పొలంబడులు పూర్తికాగా.. ప్రస్తుత ఖరీఫ్లో నాలుగో విడతను చేపట్టారు. గడిచిన మూడు సీజన్లలో ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అత్యుత్తమ ఫలితాలను సాధించిన రైతులకు రానున్న రబీ సీజన్లో జీఎపీ సర్టిఫికెట్ జారీచేయనున్నారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా.. అనంతరం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పంటల ధ్రువీకరణ చేయబోతుంది. ఈ విధంగా సర్టిఫై చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ బ్రాండింగ్ (లోగో)తో ఎగుమతి చేసేందుకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఖర్చులకు కళ్లెంతో పెరిగిన ఆదాయం 2019–20 రబీలో రూ.17.04 కోట్లతో నిర్వహించిన 5,037 పొలంబడుల ద్వారా 1,51,110 మంది రైతులు లబ్ధిపొందారు. 2020–21 ఖరీఫ్లో రూ.18.92 కోట్లతో నిర్వహించిన 10,790 పొలంబడుల ద్వారా 5.65 లక్షల మంది, రబీలో రూ.17.78 కోట్లతో నిర్వహించిన 8,050 పొలంబడుల ద్వారా 4.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. సాగు ఖర్చులు తగ్గించడం ద్వారా ఖరీఫ్లో రూ.83.93 కోట్లు, రబీలో రూ.69.70 కోట్ల మేర దిగుబడులు పెరగడంతో ఖరీఫ్లో రూ.145.96 కోట్లు, రబీలో 126.45 కోట్ల మేర అదనపు ఆదాయం పొందారు. రూ.20 కోట్లతో క్రాప్ సర్టిఫికేషన్ విభాగం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో క్రాప్ సర్టిఫికేషన్ దిశగా అధికారులు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రజల ఆరోగ్యాలకు హానిచేయని పంటలకు ప్రభుత్వమే సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత దశల వారీగా సేంద్రియ సాగువైపు రైతులను మళ్లించాలన్నది ప్రభుత్వాలోచన. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన పంటలు ఉత్పత్తి చేసే రైతులకు తొలుత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ ఇప్పించనుంది. విత్తన నాణ్యతను ధ్రువీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాధీనంలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ పనిచేస్తోంది. దీనికి అనుబంధంగానే క్రాప్ సర్టిఫికేషన్ ఏజెన్సీని కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఏజెన్సీ ద్వారా నియోజకవర్గస్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్లో శాంపిల్స్ పరీక్షించి విషపూరిత రసాయనాల్లేవని నిర్ధారించిన వాటికి ‘క్రాప్ సర్టిఫికేషన్’ ఇచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇదే లక్ష్యంతో డిసెంబర్ నెలాఖరుకల్లా కనీసం 30 శాతం ల్యాబ్లకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఎబీఎల్) గుర్తింపు సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఖర్చుతో కూడుకున్న ఈ సర్టిఫికేషన్ను పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తుండగా, మొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రభుత్వమే దీనిని చేపడుతోంది. ప్రతీ పంటకు ప్రభుత్వ బ్రాండింగ్ ప్రతీ పంటకు క్రాప్ సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా బ్రాండింగ్ కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సర్టిఫికేషన్ ఉంటే వ్యాపారులే క్యూ కడతారు. ప్రపంచంలో ఎక్కడైనా నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో పండే ప్రతీ పంటను ప్రభుత్వ లోగోతో ఎగుమతులు ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పొలంబడుల స్ఫూర్తితో క్రాప్ సర్టిఫికేషన్ కార్యాచరణ సిద్ధంచేశాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాలనే కాదు.. పరిశోధనా ఫలితాలను కూడా రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ప్రతి పంటకు క్రాప్ సర్టిఫికేషన్ చేయగలిగితే గిట్టుబాటు ధరకు ఢోకా ఉండదు. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వేరుశనగలో ఖర్చు బాగా తగ్గింది నాకు రెండెకరాల పొలం ఉంది. ఏటా వేరుశనగ సాగుచేస్తున్నా. గతంలో రూ.22 వేల వరకు ఖర్చయ్యేది. అలాంటిది పొలంబడిలో చెప్పిన విధానం ద్వారా రూ.19,050లే ఖర్చయ్యింది. నా తోటి రైతులకు ఎకరాకు 4.12 క్వింటాళ్ల దిగుబడి వస్తే నాకు 5.35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాళ్లకి ఎకరాకు రూ.21,733ల ఆదాయం వస్తే నాకు రూ.28.221ల ఆదాయం వచ్చింది. – వై. రెడ్డప్ప, జరిగడ్డదిగువపాలెం, చిత్తూరు జిల్లా పెట్టుబడి తగ్గింది.. దిగుబడి పెరిగింది నాకు ఎకరం పొలం ఉంది. గతంలో మూస పద్ధతిలో సాగుచేసేవాడిని. గడిచిన సీజన్లో పొలంబడి కింద మా పొలాన్ని ఎంపిక చేసి సాగుచేసే పద్ధతులను వివరించారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక దిగుబడి బాగా వచ్చింది. పెట్టుబడిపోను ఇతర రైతులకు రూ.20,135 మిగిలితే నాకు రూ.27,050 మిగిలింది. వచ్చే రబీలో సర్టిఫికేషన్ ఇస్తామని చెబుతున్నారు. – డి. మనోహర్రెడ్డి, తాళ్లపూడి, నెల్లూరు జిల్లా కందిలో రాబడి పెరిగింది నేను కంది సాగుచేస్తున్నా. గతంలో నాకు ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చయ్యేది. పొలంబడి పద్ధతిలో సాగుచేస్తే కేవలం రూ.11,600 ఖర్చయ్యింది. నా తోటిì రైతులకు ఎకరాకు 250 కిలోలొస్తే నాకు 450 కిలోల దిగుబడి వచ్చింది. పెట్టుబడిపోను వాళ్లకి రూ.2,600లు మిగిలితే నాకు రూ.15,400 ఆదాయం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. – తమటం బ్రహ్మారెడ్డి, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా సిలబస్ రూపొందిస్తున్నాం పంటల వారీగా సిలబస్ రూపొందిస్తున్నాం. పొలం, ఉద్యాన బడుల్లో సాధించిన ఫలితాలను అధ్యయనం చేస్తున్నాం. వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం. నెమ్మదిగా కొత్త పద్ధతికి అలవాటుపడేలా రైతులను తయారుచేస్తున్నాం. – ఏవీ నాగవేణి, శాస్త్రవేత్త, డాట్ సెంటర్, కలికిరి సర్టిఫికేషన్తో రైతులకెంతో మేలు పంటల ధ్రువీకరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సేంద్రియ సాగుచేస్తున్న వారు సైతం సర్టిఫికేషన్ గురించి తెలీక నష్టపోతున్నారు. ప్రభుత్వమే సర్టిఫై చేస్తే రైతులకు ఎంతో మేలు. ఇదే జరిగితే రైతులకు మంచి గిట్టుబాటు రావడమే కాక ఎగుమతులూ పెరుగుతాయి. – జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్ -
15 రోజుల్లో మాఫీపై నిర్ణయం
బెంగళూరు: రుణమాఫీపై 15 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రతి రైతు ఇంటికొచ్చి వారి రుణాలను రద్దుచేసినట్లు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లని, చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి తీసుకున్న రుణాలను రెండు దశల్లో మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం ఆయన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులు ఎంత రుణం తీసుకున్నా మాఫీచేస్తామని స్పష్టంచేశారు. 2009 ఏప్రిల్ 1 – 2017 డిసెంబర్ మధ్య రుణాలు పొందిన రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారు. వేడుకలు, బైకులకు వాడుకున్న రుణాలనూ రద్దుచేయాలా.. సాగు కోసం తీసుకున్న రుణాలతో కొందరు పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారని, కొందరు బైకులు కొనుగోలు చేస్తున్నారని కుమారస్వామి అన్నారు. అలాంటి వారి రుణాలను కూడా మాఫీ చేయాలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే, రైతులను కాపాడేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాఫీ చేయాల్సిన మొత్తం ఎంతో లెక్కగడుతున్నాం. మరో 2–3 రోజుల్లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంటాం’ అని కుమారస్వామి అన్నారు. ప్రతి జిల్లాలో నియమించే నోడల్ అధికారి రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరిస్తారని, వాటి ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర సమావేశమై ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రూ.53 వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో జేడీఎస్ ప్రకటించింది. ఈ హామీ అమలు ఆలస్యమవడంతో బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
పారదర్శకంగా పని చేయిస్తా..
ఉన్నత స్థాయి అధికారులే వ్యవస్థకు ఆదర్శం నాగార్జున వర్సిటీతో 30 సంవత్సరాల అనుబంధం వృత్తి నైపుణ్యం, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీకి ఆన్లైన్ విధానం ఏఎన్యూ ఇన్చార్జి వీసీ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ ఏఎన్యూ: ఏ వ్యవస్థకైనా ఉన్నత స్థాయి అధికారులే ఆదర్శమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) ఇన్చార్జి వీసీ ఆచార్య వెల్లంకి సాంబశివకుమార్ అన్నారు. ఏఎన్యూ ఇన్చార్జి వీసీగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వర్సిటీలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏమీ అవసరం లేదని తాను ఉన్నన్ని రోజులు పారదర్శకంగా పనిచేస్తూ కింది స్థాయి వారితో కూడా పని చేయిస్తానన్నారు. ఏఎన్యూతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. 1984 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం, వివిధ తనిఖీలు, ప్రత్యేక కమిటీలు తదితర విధులకు తాను ఏఎన్యూలో బాధ్యత వహించానన్నారు. ఏఎన్యూకు చెందిన అధికారులు, అధ్యాపకులతో మంచి పరిచయాలు ఉన్నాయని ఇతర యూనివర్సిటీకి ఇన్చార్జిగా వచ్చానన్న భావన తనకు లేదన్నారు. ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు దోహదం చేసే భాష, భావ వ్యక్తీకరణ అంశాలపై శిక్షణను వీలైనంత మేరకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏఎన్యూ నుంచి విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్లు, పత్రాల పంపిణీలో ఆన్లైన్ డెలివరీ విధానాన్ని అతి త్వరలో ప్రవేశ పెడతానన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి రాకుండా ఇంటివద్ద నుంచే సర్టిఫికెట్లు పొందే విధంగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ఇస్తుందని ఏఎన్యూ అధ్యాపకులు మంచి ప్రాజెక్టు సిద్ధం చేస్తే ఢిల్లీలో ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.