breaking news
Birth Centenary
-
అందం కమ్మేసిన అద్భుతం
‘సెక్స్ సింబల్’... ‘డంబ్ బ్లాండ్’.... ప్రపంచం ఆమెకు వేసిన ముద్రలివి... కానీ చరిత్ర ఇప్పుడు చెబుతోంది... ‘మన్రో ఒక జీనియస్’. అందం వెనుక దాగిన అక్షరాస్యురాలు. కెమెరా ఎదుట కవ్వించిన ఆమె ఓ పుస్తకాల పురుగు. 2026 జూన్1కి ఆమెకు నూరేళ్లు. జీవించి ఉంటే నూరవ బర్త్డే కేక్ కట్ చేసేది. కానీ 36 ఏళ్లకే లైట్స్ ఆఫ్ అంది. 100 ఏళ్ల తర్వాత కూడా వెలుగుతూనే ఉంది. మన్రో కేవలం అందగత్తె కాదు. తెర మీద కనిపించినట్టుగా ‘డంబ్ బ్లాండ్’ కాదు. ఆమె ఒక తిరుగుబాటుదారు. కవయిత్రి. ఫెమినిస్ట్. సినిమా ప్రొడక్షన్కు అధినేత. అప్పటికి దస్తోయెవ్స్కీని ఇతర గొప్ప రచయితలను చదివిన అరుదైన హాలీవుడ్ నటి. కాని లోకం ఆమెకు ‘ఖాళీ బుర్ర’ అని ముద్ర వేసింది. నిజం ఏంటంటే మన్రో ఐ.క్యూ. చాలా ఎక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా కడతారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐ.క్యూ. కంటే ఎక్కువ అనేవారూ ఉన్నారు. మార్లిన్ మన్రో చాలా తెలివైనది, మేధావి. అందుకు ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో కనిపించిన 400లకు పైగా పుస్తకాల లైబ్రరీయే సాక్ష్యం. అవి అలంకారానికి అక్కడ లేవు. మన్రో వాటిని చదివినట్టుగా జేమ్స్ జాయిస్ ‘యులిస్సెస్’, దోస్తోయెవ్స్కీ ‘ది బ్రదర్స్ కరమజోవ్’, ఫ్రాయిడ్, రిల్కే, వాల్ట్ విట్మన్... అన్నీ పుస్తకాల్లో అండర్లైన్ చేసి, మార్జిన్ లో నోట్స్ రాసుకుని ఉంది. ఆమెను ‘మీరేం చదువుతారు?’ అని ఎవరో అడిగితే ‘నేను కవిత్వం చదువుతాను. ఎందుకంటే కవిత్వం నిజం చెబుతుంది. హాలీవుడ్ అబద్ధం చెబుతుంది’ అని జవాబు చెప్పింది. కవిత్వం రాసేది. ఆమె డైరీల్లో దొరికిన కవిత ఒకటి:‘మనం ఇతరులను పూర్తిగా తాకలేం; మనలోని కొంతే వారిలోని కొంతను తాకుతుంది. ప్రతి ఒక్కరి సత్యం వారికి మాత్రమే సొంతం’ఇది ‘డంబ్ బ్లాండ్’ రాసే కవిత్వమా? ఇది తత్త్వం. 1950ల్లో హీరోయిన్లంటే స్టూడియోల చేతిలో కీలుబొమ్మలు. కాంట్రాక్ట్ చేసుకున్న డబ్బే జీతం. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే హక్కు లేదు. డైరెక్టర్ని ప్రశ్నించే ధైర్యం లేదు. మార్లిన్ ఏం చేసిందో తెలుసా? 1954లో ట్వంటియెత్ సెంచరీ ఫాక్స్తో ఏడేళ్ల కాంట్రాక్ట్ను తెంచుకుని న్యూయార్క్ వెళ్లిపోయింది. లీ స్ట్రాస్బర్గ్ దగ్గర ‘మెథడ్ యాక్టింగ్’ నేర్చుకుంది. 1955లో సొంతంగా ‘మార్లిన్ మన్రో ప్రొడక్షన్స్’ అనే కంపెనీ పెట్టింది. హాలీవుడ్ చరిత్రలో స్టూడియోల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టిన తొలి ఫీమేల్ స్టార్ మన్రో. ఆ దెబ్బకు ఫాక్స్ దిగొచ్చింది. కొత్త కాంట్రాక్ట్ ఇచ్చింది. పారితోషికం ఎంతో తెలుసా? సినిమాకు లక్ష డాలర్లు, అంతేకాదు లాభాల్లో వాటా, డైరెక్టర్నీ, స్క్రిప్ట్నీ అప్రూవ్ చేసే హక్కూ. ఆ రోజుల్లో ఒక హీరోయిన్ కి ఇన్ని హక్కులు రావడం అంటే విప్లవం. అలాంటి విప్లవ వనిత మన్రో. లాస్ ఏంజిల్స్లో మోకాంబో అనే ఫేమస్ నైట్క్లబ్ ఉండేది. అక్కడ నల్లజాతి గాయనిలకు అనుమతి లేదు. ఎల్లా ఫిట్జ్గెరాల్డ్ అనే గొప్ప సింగర్కు అక్కడ పాడే అవకాశం ఇవ్వలేదు క్లబ్. మెర్లిన్ ఫోన్ చేసింది. క్లబ్ ఓనర్తో మాట్లాడింది. ‘నువ్వు ఎల్లాకు వారం బుకింగ్ ఇస్తే, నేను ప్రతి రాత్రి ఫ్రంట్ టేబుల్లో కూర్చుంటా. ప్రెస్ మొత్తం వస్తుంది. నీ క్లబ్కి ఫ్రీ పబ్లిసిటీ’ అంది. ఓనర్ ఒప్పుకున్నాడు. వారం రోజులు మెర్లిన్ ఫ్రంట్ రోలో కూర్చుంది. నల్ల గాయని ఎల్లా కెరీర్ ఆ వారం రోజుల్లో మారిపోయింది. తర్వాత ఎల్లా ‘నేను మార్లిన్ మన్రోకు నిజంగా రుణపడి ఉన్నాను. ఆమె మాట ఇచ్చినట్టుగా ప్రతి రాత్రి ముందు వరుస టేబుల్లో కూర్చుంది. ఆమె ఊహించినట్టుగానే ప్రెస్ వాళ్లు పిచ్చెక్కిపోయారు.’ ఇది గ్లామర్ డాల్ చేసే పనా? కాదు. ఇది జెండర్, జాతి వివక్ష గోడలను బద్దలు కొట్టిన యోధురాలి పని. ప్రపంచమంతా పేరు గడించిన ఈ తార బాల్యానిది ఊరు పేరూ లేని అనాథ బతుకు అనంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పుట్టింది జూన్ 1, 1926. లాస్ ఏంజిల్స్లో. అసలు పేరు నార్మా జీన్. తండ్రి ఎవరో తెలీదు. తల్లి గ్లాడీస్కు మానసిక ఆరోగ్యం బాగుండేది కాదు. దాంతో నార్మా జీన్ జీవితం అనాథాశ్రమాలలో అక్కడా ఇక్కడా గడిచింది. ఈ బాధల నుంచి విముక్తికి 16 ఏళ్లకే పొరుగింట్లో ఉండే జేమ్స్ డోహెర్టీ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోప్లేన్ కంపెనీలో డ్రోన్ పార్ట్స్ తనిఖీ చేసే ఉద్యోగాన్ని వారానికి 20 డాలర్లు లెక్కన చేస్తుంటే 1944లో ఆర్మీ ఫొటోగ్రాఫర్ డేవిడ్ కొనోవర్ ఆ ఫ్యాక్టరీలో ఫొటోలు తీయడానికి వచ్చి ఈమెను చూశాడు. ‘నువ్వు మోడలింగ్ చేస్తే బాగుంటుంది‘ అన్నాడు. ఫొటోలు తీశాడు. ఆ ఫోటోలతోనే నార్మా జీన్ జీవితం మలుపు తిరిగింది. కొన్నాళ్లు మోడలింగ్ చేశాక మన్రోకు ట్వంటియెత్ సెంచరీ ఫాక్స్ స్టూడియో కాంట్రాక్ట్ ఇచ్చింది. కండిషన్ ఒకటే– పేరు మార్చుకోవాలి, జుట్టు బ్లాండ్ చేసుకోవాలి. ఆ స్టూడియో ఎగ్జిక్యూటివ్ బెన్ లియాన్ ‘మార్లిన్’ అనే పేరు సజెస్ట్ చేశాడు. ‘మన్రో’ తనే జత చేసుకుంది. అది ఆమె అమ్మమ్మ ఇంటిపేరు. అలా నార్మా జీన్ ‘మార్లిన్ మన్రో’ అయ్యింది. మొదట్లో చిన్న చిన్న వేషాలు. డైలాగ్ ఒక్క ముక్క. కానీ ఆ ఒక్క ముక్కలో, ఒక్క నవ్వులో హాలీవుడ్ని కట్టిపడేసింది. జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండ్స్ (1953), హౌ టు మ్యారీ ఎ మిలియనీర్ (1953), ది సెవెన్ ఇయర్ ఇచ్ (1955), బస్ స్టాప్ (1956), సమ్ లైక్ ఇట్ హాట్ (1959), ది మిస్ఫిట్స్ (1961)... సూపర్హిట్లు. హాలీవుడ్లో అందరూ ‘స్ట్రాంగ్’గా కనిపించాలని చూస్తారు. మెర్లిన్ మాత్రం ‘నాజూకు’గా కనిపించింది. ఆమె కళ్లలో అభద్రత, అమాయకత్వం... ప్రేక్షకుడు చూడగానే ‘అయ్యో పాపం, ఈమెని నేను కాపాడాలి’ అనుకునేవాడు. అదే ఆమె ట్రంప్ కార్డ్. బలంగా కాదు బలహీనంగా కనిపించి గెలిచిన ఏకైక స్టార్ ఆమె.ఆమె గొంతు మామూలుగా ఉండేది కాదు. ‘బ్రెతీ వాయిస్’ అంటారు. గొంతుతోనే శృంగారం పలికించగలిగిన నటి. షాట్ తీస్తున్నప్పుడు లైట్ ఎక్కడ పడాలో ఆమెకు తెలుసు. తల కొంచెం వంచడం, గడ్డం కిందికి దించి పైకి చూడడం, భుజం తిప్పడం ప్రతి కదలికా లైటింగ్తో డ్యాన్ ్స చేసినట్టు ఉండేది. ‘సెవెన్ ఇయర్ ఇచ్’లో ఐకానిక్గా నిలిచి డ్రెస్ ఎగిరే సీన్ కోసం, గాలికి ఎలా రియాక్ట్ అవ్వాలనే ఎక్స్ప్రెషన్ కోసం 11 టేకులు రిహార్సల్ చేసింది. ఆమెది స్క్రీన్ మ్యాజిక్ కాదు, స్క్రీన్ సైన్ ్స. సాధారణంగా స్త్రీలు కామెడీ చేయరు. కాని మార్లిన్ది అద్భుతమైన కామిక్ టైమ్. చార్లీ చాప్లిన్ తర్వాత కామెడీని పండించిన స్టార్ ఆమె. ఇక మన్రో లిప్స్టిక్ పెదాలు జగద్విదితం. తన పెదాలకు ఎర్రదనం కోసం ఐదు షేడ్స్ కలిపేదట. ఆ కిటుకు ఇతరులకు తెలియదు. ఆగస్ట్ 5, 1962. లాస్ ఏంజిల్స్లోని బ్రెంట్వుడ్ ఇంట్లో శవమై కనిపించింది మన్రో. అప్పటికి వయసు 36. అధికారిక కారణం నిద్రమాత్రల ఓవర్డోస్. కొందరు ఆత్మహత్య అన్నారు. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ. కెన్నెడీ బ్రదర్స్, మాఫియా, ఎఫ్.బి.ఐ.... చాలా థియరీలు ఉన్నాయి. ఆమె సమాధి లాస్ ఏంజిల్స్లో వెస్ట్వుడ్ విలేజ్ మెమోరియల్ పార్క్లో ఉంది. నార్మా జీన్ గా పుట్టి, మార్లిన్ మన్రోగా ఎదిగి, లెజెండ్గా మిగిలిపోయింది. 16 సినిమాలే చేసింది. 36 ఏళ్ల చిన్న జీవితమే కావ చ్చు. కానీ 100 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఆమె పుట్టినరోజును జరుపుకుంటోంది.కొందరు స్త్రీలు నటీమణులు. కొందరు స్త్రీలు సూపర్స్టార్లు. కానీ మార్లిన్ మన్రో ఒక్కత్తే. కల్చరల్ ఫినామినన్. అమరం అయిన అందం. – ఖదీర్ -
ఘనంగా రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలు
-
ప్రతిభా నైపుణ్యాలు అవసరం
ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి బుక్కరాయసముద్రం: విద్యార్థులకు ప్రతిభా నైపుణ్యాలు ఎంతో అవసరమని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇంటెలిజెస టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్ర«థమ, ద్వితీయ సంత్సరం చదువుతున్న 1924 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలైనవారికి ఈ నెల 22న శ్రీనివాస రామానుజ¯ŒS జయంతిని పురస్కరించుకుని బహుమతులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి బహుమతిగా ల్యాప్టాప్, ద్వితీయ బహుమతిగా 10 ఇ¯న్చెస్ ట్యాబ్లెట్, తృతీయ బహుమతిగా 7 ఇంచుల ట్యాబ్లెట్ ప్రదానం చేస్తామన్నారు. వీటితో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఏఓ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, నిజాం భాషా, అద్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
గాంధర్వ గాయని
కంచిపట్టు చీరతో, చక్కని ముఖ వర్చస్సుతో వేదిక మీద కనిపించే సుబ్బులక్ష్మి పాట ఎంతో పవిత్ర భావనను వెదజల్లేది. అందుకే ‘ఆమె కర్ణాటక సంగీత రాజ్యానికి రాణి’ అన్నారు జవహర్లాల్. ‘భారత కోకిల’ అన్నారు కవికోకిల సరోజినీదేవి. ఆమె ‘సుస్వరలక్ష్మి’ అని కీర్తించాడు బడే గులాం అలీఖాన్. ఒక సందర్భంలో ఏపీజే అబ్దుల్కలాం తన జీవితంలో ముగ్గురు తల్లులు ఉన్నారని చెప్పారు. ఆ ముగ్గురు - ఒకరు కన్నతల్లి, మరొకరు మదర్ థెరిసా, మూడో తల్లి - ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి ‘తపస్విని’ అన్నారు లతా మంగేష్కర్. ఇటీవలే సెప్టెంబర్ 16న విశ్వవ్యాప్త సంగీత ప్రపంచం సుబ్బులక్ష్మి శత జయంతిని జరుపుకుంది. ఆ సందర్భంగా ఎంఎస్ బయోగ్రఫీ. రాగం మీద మరింత దృష్టిని ప్రతిష్టించడానికి ప్రతి కీర్తనకు ముందు ఆమె క న్నుల మీద సుతారంగా వాలేవి రెప్పలు. ఇప్పుడు సంగీత ప్రియుడైన ఏ భారతీయుడు కర్ణాటక సంగీతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు అలా కళ్లు మూసుకున్నా వాళ్ల దృష్టిపథంలోకి ఆమె ప్రత్యక్షమవుతారు. ఆమె.. మదురై షణ్ముఖవాదివు సుబ్బులక్ష్మి. ఇరవయ్యో శతాబ్దపు కర్ణాటక సంగీత సంప్రదాయానికి ప్రత్యేక కీర్తిని సాధించిపెట్టిన అపురూప భారతీయ వనిత. ఏడు దశాబ్దాల పాటు అలుపనేది లేకుండా గానించిన గళం ఆమెదే. ఎలాంటి ఇతర పోకడలకు చోటులేని వంద శాతం కర్ణాటక సంప్రదాయాన్ని ఎంఎస్ గొంతు సొంతం చేసుకుంది. 1927లో పదకొండేళ్ల ప్రాయంలో తిరుచిరాపల్లిలో ఒక కచేరీతో ఆరంభమైన ఆ గాన వాహిని చివరి వరకు గానప్రియులను అలరిస్తూనే ఉంది. ఒక జన్మలో వీలయ్యేదా?! సుబ్బులక్ష్మిని 20వ శతాబ్దపు కర్ణాటక సంగీతానికి ప్రతీక అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన కచేరీలు వేల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు నిధులు సమకూర్చిపెట్టడానికి ఆమె ఉచితంగా పాడారు. తొలిరోజులలోనే రికార్డిస్టుగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులు ఇచ్చారు. ప్రపంచం ఆమె పాటను మైమరచి ఆలకించింది. ఇంత కృషి మరో కళాస్రష్ట జీవితంలో సాధ్యమయ్యేది కాదేమో! ఒక జన్మలో చేయడానికి వీలయ్యేది కూడా కాదేమో! రికార్డింగ్ సంస్థల కోసం ఆమె పాడిన మొదటి పాట ‘మరకతం వడివుయం’. ఈ పాటకి పక్క వాయిద్యాలను అందించిన వారిలో షణ్ముఖివాదివు కూడా ఉన్నారు. ఆమె గొప్ప వైణికురాలు. సుబ్బులక్ష్మి కన్నతల్లి. అమ్మమ్మ వాయులీనంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. రికార్డిస్టుగా ‘స్టార్’ హోదా రావడంతో స్వస్థలం మదురై నుంచి ఆ కుటుంబం మద్రాసుకు తరలి వచ్చింది. కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి సాంస్కృతిక రాజధాని వంటి చెన్నపట్టణానికి ఆమె గాన మాధుర్యం పరిచయం కావడం ఎంతో యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సరస్వతి కటాక్షించినట్టే జరిగింది. ప్రఖ్యాత మద్రాసు మ్యూజిక్ అకాడమిలో ఏర్పాటయిన కచేరీని, నాటి సంగీత విద్వాంసులలో ఒకరైన అరియకుడి రామానుజ అయ్యంగార్ హఠాత్తుగా అస్వస్థులు కావడం వల్ల రద్దు చేసుకున్నారు. నిర్వాహకులు సుబ్బులక్ష్మి చేత మొదటిసారి పాడించారు. 1933 డిసెంబర్లో ఇది జరిగింది. తరువాత కొన్నేళ్లకి ఆ అకాడమి ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ‘సంగీత కళానిధి’ సుబ్బులక్ష్మి స్వీకరించారు. వెండితెరపై సువర్ణగాత్రం ఎంఎస్ సువర్ణగాత్రం వెండితెర మీద కూడా వెన్నెలలు విరబూయించింది. అక్కడ కూడా ఆమె ఒక వెలుగు వెలిగారు. మున్షీ ప్రేమ్చంద్ అద్భుత నవల ‘సేవాసదన్’ ఆధారంగా నిర్మించిన చిత్రంలో ఎంఎస్ నటించారు. 1938లో ఆ చిత్రం విడుదలయింది. వారణాసి నేపథ్యంలో ఒక సాధారణ గృహిణి ఎలాంటి పరిస్థితులలో గడప దాటిందో ఈ కథలో ఆ మహా రచయిత మహోన్నతంగా ఆవిష్కరించారు. ఇందులో కట్నం సమస్యను కూడా ప్రస్తావించారాయన. ఆ ఒక్క చిత్రంతోనే సుబ్బులక్ష్మి గాయక నటిగా వినుతికెక్కారు. 1940లో ఎల్లిస్ దున్గన్ ఎంఎస్తోనే శకుంతల చిత్రం నిర్మించారు. ఆ తరుణంలోనే ‘కల్కి’ సదాశివంతో వివాహమైంది. సదాశివం ‘కల్కి’ పత్రిక నడిపేవారు. సి. రాజాజీకి సన్నిహితుడు. జాతీయోద్యమంలో పనిచేసేవారు. ‘కల్కి’ పత్రికకు నిధులు సమకూర్చడానికి ఎంఎస్ 1941లో నారద పాత్రతో ‘సావిత్రి’ చిత్రంలో కనిపించారు. అలనాటి ప్రఖ్యాత హిందీనటి శాంతా ఆప్టే సావిత్రి పాత్రలో కనిపించారు. మళ్లీ 1945లో ఎల్లిస్ దున్గన్ దర్శకత్వంలోనే ఎంఎస్ ‘మీరా’ చిత్రంలో కథానాయిక పాత్ర ధరించారు. మీరా చిత్రాన్ని జవహర్లాల్ నెహ్రూ, భారత ఆఖరి వైశ్రాయ్ మౌంట్బాటన్తో కలసి ఢిల్లీలో చూశారు. ఈ చిత్రంలో అన్ని పాటలూ ఎంఎస్ ఒక్కరే పాడారు. ఆ సినిమా చూసి, ఆ పాటలకు మైమరచి సరోజినీ నాయుడు ఎంఎస్ను ‘భారత కోకిల’ అని శ్లాఘించారు. ప్రాగ్, వెనీస్లలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా మీరాను ప్రదర్శించారు. ఎంఎస్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. కానీ అదే ఆమె ఆఖరి చిత్రమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంఎస్ చలనచిత్ర జీవితానికి శుభం కార్డు వేసి, కర్ణాటక సంగీతానికే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికలపై... 1960లో అంతర్జాతీయ వేదిక మీద పాడేందుకు సుబ్బులక్ష్మికి మొదటిసారి అవకాశం వచ్చింది. అప్పటికే ఆకాశవాణి ద్వారా, కచేరీల ద్వారా కర్ణాటక సంగీత ప్రియులకు ఆరాధనీయ గాయనిగా మారిన ఎంఎస్ను ఎడిన్బరో ఉత్సవానికి ఆహ్వానించారు. 1963లో అక్కడ కచేరి జరిగిన తరువాత మరుసటి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంలో పాడేందుకు రావలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి యు థాంట్ ఆహ్వానించారు. 1966లో సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె పాడారు. ఇది సుబ్బులక్ష్మి శతజయంతి అయితే, జనరల్ అసెంబ్లీలో ఆమె పాట పాడి యాభై ఏళ్లు పూర్తి కావడం కేవలం యాదృచ్ఛికం (జనరల్ అసెంబ్లీలో పాడిన మొదటి గాయని ఎంఎస్. రెండోసారి ఆగస్టు 16, 2016న అదే అవకాశాన్ని పొందిన వారు ఏఆర్ రెహమాన్. ఆ సందర్భంలో రెహమాన్ ఎంఎస్కు ఘనంగా నివాళి సమర్పించారు). ఈ కచేరీ నిజంగా చరిత్రాత్మకం. ఆ కార్యక్రమంలో ఆమె మొత్తం 30 గీతాలు పాడారు. అవి ఆరు భాషలకు చెందినవి. అదొక అపురూప ఘట్టం. జెనీవాలోని రెడో విల్లాలో పాడే అవకాశం కూడా భారతదేశం నుంచి ఎంఎస్కే లభించింది. విశ్వవిఖ్యాత సంగీతకారుడు బీతోవెన్ ఒకసారి కచేరి చేసిన వేదిక అది. పారిస్, లండన్, న్యూయార్క్ నగరాలు కూడా ఎంఎస్ గానవాహినలో తడిసినవే. ఔన్నత్యంలో తపస్విని ఎంఎస్ జీవితాంతం ఆరాధించిన కళ, ఆమెను భూగోళానికి పరిచయం చేసిన పాట ఎంఎస్ను ఒక తపస్విని స్థాయికి తీసుకువెళ్లాయి. సుబ్బులక్ష్మి, మరో ప్రఖ్యాత విదుషీమణి డీకే పట్టమ్మాళ్ చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారు. ఆ వీధికి సుబ్బులక్ష్మి పేరు పెట్టదలిచామని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కానీ అందుకు ఎంఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ వీధికి ఏదైనా ఒక పేరు పెట్టాలి అంటే, అది పట ్టమ్మాళ్ పేరు మాత్రమే అయి ఉండాలని చెప్పారామె. ఆమె సంగీత సామ్రాజ్యంలో రాణి అయినా, ఔన్నత్యంలో మాత్రం తపస్వినే. అదే చెబుతోంది ఈ ఉదంతం. మీరా భజన్లు అద్భుతంగా ఆలపించిన ఆ దక్షిణాది గాయని ఉత్తర భారత ప్రజల హృదయాలను అలవోకగా గెలిచారు. పురుషాధిపత్యంతో సాగుతున్న కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మహిళ గొంతును ప్రథమంగా బలంగా వినిపించారు. ఎంఎస్ సంగీతానికి శరీరం రాగమే కావచ్చు. కానీ దాని ఆత్మ భక్తి. ఆమె ఆలపించిన ఏ రాగమైనా భక్తిభావంతోనే తొణికిసలాడేది. భక్తిగీతమే ఈ చరాచర ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనిషి హృదయాన్నయినా తాకగలుగుతుందని ఆమె విశ్వసించారు. చిరస్మరణీయం అయ్యారు. - డాక్టర్ గోపరాజు నారాయణరావు దేశానికి ఇష్టమైన పాట శంకర భగవత్పాదుల గీతాలు, శ్లోకాలు; మరాఠీ భక్తకవి తుకారామ్ గీతాలు, గురుగ్రంథ సాహెబ్లోని గీతాలు, మీర్జా గాలిబ్ ఉర్దూ ఘజల్స్ కూడా ఎంఎస్ గానం చేశారు. ఆమె పాడిన అన్నమాచార్య కీర్తనలు, వెంకటేశ్వర సుప్రభాతం ఏదో సందర్భంలో ఆలకించని ఇల్లు దక్షిణ భారతదేశంలో ఉండదు. ఇక బెంగాలీ భాషలో ప్రఖ్యాత జాతీయవాద కవి ద్విజేంద్రలాల్ రాయ్ రాయగా, ఎంఎస్ పాడిన పాట, ‘ధనో ధన్య పుష్పో భరా’ మన దేశంలో ఎందరికో అత్యంత ఇష్టమైన పాట. కాలాతీత గాత్ర మాధుర్యం గాంధీజీ టేప్ చేయించుకుని మరీ విన్నారు! గాంధీజీ 78వ జన్మదినం. ఆ అక్టోబర్ 2న గాంధీజీ కోసమే ఢిల్లీలో కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, ఆ రోజున ఎంఎస్ వచ్చి, గాంధీజీకి ఎంతో ఇష్టమైన మీరా భజన్ ‘హరి తుమ్ హరో’ పాడగలరా అని అడుగుతూ ‘కల్కి’ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత సుచేతా కృపలానీ ఆ ఫోన్ చేశారు. అయితే ఆ భజన్ ఎంఎస్కు రాదనీ, అలాగే ఆ వారం ఢిల్లీకి రావడం కూడా సాధ్యం కాదనీ సదాశివం చాలా హుందాగా సుచేత ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరెవరితో అయినా పాడించమని సలహా ఇచ్చారు. ఇక పుట్టినరోజు రెండు రోజులు ఉందనగా మళ్లీ ఫోన్. ఆ భజన్ను వేరొకరి కంఠం నుంచి వినడం కంటే, ఎంఎస్ ఆ పాటను టేప్ చేసి పంపితే వింటానని గాంధీజీ మరీ మరీ కోరినట్టు సుచేత చెప్పారు. ఇక తప్పలేదు. గాంధీజీ మీద గౌరవంతో సదాశివం ఆగమేఘాల మీద మద్రాసులోని ఆకాశవాణిలో రికార్డ్ చేయించి, ఢిల్లీ పంపించారు. ఆ విధంగా గాంధీజీ తన పుట్టిన రోజున ఆ భజన్ చెవులారా విన్నారు. కానీ, 1947లో జరిగిన ఆ పుట్టినరోజే చివరి పుట్టినరోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురైయ్యారు. ఆ సమయంలోనే ఆకాశవాణి ఆయనకు నివాళిగా ఒక పాటను వినిపించింది. అది గాంధీగారి కోసం ఆ రోజు సుబ్బులక్ష్మి మద్రాసు ఆకాశవాణిలో రికార్డు చేసి పంపినదే. దానితో ఆమెపేరు ఇంటింటా మారుమోగింది. -
పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’
భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహా నాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం సంజీవరెడ్డి. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం. స్వశక్తితో, స్వీయ ప్రతిభతో, రాజకీయ చతురతతో రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహానేత నీలం సంజీవరెడ్డి. భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహానాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం. అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 సంవత్సరం మే 19న ఒక రైతు కుటుంబంలో పుట్టిన సంజీవరెడ్డి విద్యార్థి దశలోనే జాతీయ భావాల పట్ల ఆకర్షితులయ్యారు.1922,1929లలో గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగం సంజీవరెడ్డిని విశేషంగా ప్రభావితం చేసింది. అప్పటికే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. చిన్న వయస్సులోనే సంజీవరెడ్డి అసాధారణ నాయకత్వ లక్షణాలు కాంగ్రెస్ నాయకులను అబ్బురపరిచాయి. కాంగ్రెస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 1940లో వేలూరు జైలులో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను పట్టాభి సీతారామయ్య చెపుతూ ఉండగా, సంజీవరెడ్డి రాశారు. 1959-60లో సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1951లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆచార్య రంగా, సంజీవరెడ్డి మధ్య జరిగిన పోటీలో సంజీవరెడ్డి ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదొక చరిత్రాత్మక సన్నివేశం. ఆ తర్వాత ప్రకాశం, రంగా కాంగ్రెస్ను వీడి వేరే పార్టీ పెట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కాని నీలం వెంటనే ప్రకాశం పంతులు ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆయన్ని అభ్యర్థించారు. ఇది విని ప్రకాశం నిర్ఘాంతపోయారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం గొప్ప త్యాగమూర్తి అయిన ప్రకాశం నాయకత్వం అ సమయంలో అవసరమని భావించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ని ఒప్పించి తాను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అతిపిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టారు. ఆయనది అందర్నీ కలుపుకొనిపోయే మనస్తత్వం. అప్పటికే తనపై పోటీ చేసి ఓడిపోయిన బెజవాడ గోపాలరెడ్డిని కేబినెట్లోకి ఆహ్వానించారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన యెహ్ద్ నవాజ్ జంగ్, కేవీ రంగారెడ్డిలను కూడా తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. 1962లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 18కి పైగా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అత్యున్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించే సంస్కారం ఆయనకే చెల్లు. కర్నూలు జిల్లాలో బస్రూట్లను జాతీయం చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నైతిక బాధ్యత వహిస్తూ 1964 ఫిబ్రవరి 26న ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. 1967లో హిందూపూర్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత స్పీకర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో హోరాహోరీగా జరిగిన రాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా సంజీవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలం అభ్యర్థిత్వం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఇష్టం లేదు. ఈ విషయం బయటకు చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘అంతరాత్మ ప్రబోధం’ మేరకు ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో అధికార అభ్యర్థి సంజీవరెడ్డి ఓడిపోయి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగిన వీవీ గిరి అనూహ్యంగా విజయం సాధించారు. తర్వాత కొంతకాలం సంజీవరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. జనతాపార్టీ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన ఆయన 1977 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఆ పార్టీ టికెట్పై గెలిచిన ఏకైక నాయకుడు. అంతేకాదు, రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి కూడా సంజీవరెడ్డి కావడం విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాత ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. అనంతపురంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన సలహాలు తీసుకునేందుకు రాజకీయ ప్రముఖులు వచ్చేవారు. జ్ఞానీ జైల్సింగ్, వెంకట్రామన్, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కూడా కలిసేవారు. తనను చూడవచ్చిన ఆత్మీయులతో మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లుప్తం కావడం, హింసాకాండ పెరగడంపై ఆయన ఆవేదన చెందేవారు. ప్రస్తుతం చెలరేగిన ఈ ప్రాంతీయ దురభిమానాలనూ, సంకుచిత పోకడలనూ చూసి ‘నీలం’ ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో? ఆయన ఆత్మకు శాంతి కలగాలి. (నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగిసిన సందర్భంగా) - డాక్టర్ కె.వి.కృష్ణకుమారి (వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి)


