breaking news
Banks Notices
-
అప్పుతీర్చకపోయారో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలంగాణ నుంచి విలీనం చేసుకున్న మండలాలలోని రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదు. వారు రుణం తీసుకున్న బ్యాంకులు తెలంగాణ పరిధిలో ఉండటంతో అటు తెలంగాణ ప్రభుత్వం గాని, ఇటు ఆంధ్రా ప్రభుత్వం కాని పట్టించుకోవడం లేదు. తాజాగా అప్పు తీర్చాలని లేనిపక్షంలో ఆస్తులు వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. విలీన మండలాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి సవతి ప్రేమ చూపిస్తోంది. అసలు తాను పదవీ బాధ్యతలు చేపట్టనని మొండికేయడంతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని పదేపదే సీఎం తమను వంచించారంటూ ఆగ్రహం చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ మండలాల ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆర్ అండ్ ఆర్, పునరావాసం విషయంలో వారికి నష్టం జరుగుతూనే ఉంది. ఈ మండలాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. మరోవైపు వారికి రుణమాఫీ విషయంలో కూడా అన్యాయం జరిగింది. అసలు తాము ఏ రాష్ట్రానికి చెందినవారమో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి తమకు రుణ ఉపశమన పత్రాలను అందించి ఊరుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ఖాతాలో నగదు జమచేయకుండా మోసగించారని కుక్కునూరు మండలంలోరి చీరవెల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని లేదా రెన్యూవల్ చేయించుకోవాలని బ్యాంకుల నుంచి సుమారు 50 మంది రైతులకు నోటీసులు అందడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న తమను వంచించిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. వడ్డీ కొండలా పెరిగింది నేను వ్యవసాయానికని భద్రాచలం ఎస్బీఐలో రూ 50 వేలు రుణం తీసుకున్నాను. చంద్రబాబు రుణమాఫీ అంటూ వాగ్దానాలు చేయడంతో రుణం కట్టకుండా వదిలేశాను. దాంతో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కలిపి రూ.1.20 లక్షలు రుణాన్ని చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. రూ.50 వేల రుణానికి వడ్డీ రూ. 70 వేలు అయి కూర్చుంది. చంద్రబాబును నమ్ముకున్నందుకు రైతులందరం నట్టేట మునిగాం. చేకూరి సూర్యనారాయణరాజు, రైతు, చీరవెల్లి, కుక్కునూరు మండలం రుణమాఫీ జరగలేదు నేను బ్యాంకులో రూ. 40 వేలు రుణం తీసుకున్నాను. నేను తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపితే రూ.1.20 లక్షలు కంటే ఎక్కువ అయి ఉండదు. రూ.1.50 లక్షల లోపు రుణాన్ని మొత్తం మాఫీ చేస్తామన్న చంద్రబాబు నాకు ఇంతవరకు రుణమాఫీ చేస్తున్నట్లు కనీసం రుణఉపశమన పత్రాన్ని కూడా అందించలేదు. కుండా రమణ, రైతు, చీరవెల్లి, కుక్కునూరు -
రుణ విముక్తి సరే..బ్యాంకు నోటీసుల సంగతేంటి?
సంతమాగులూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని సదస్సులు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారు సరే..ఇప్పుడు కూడా బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు కట్టకపోతే వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి..వాటి సంగతేంటి’ అని రైతు సాధికారత సదస్సులకు వెళ్లిన అధికారులను రైతులు నిలదీస్తున్నారు. మండలంలోని పుట్టవారిపాలెం, మామిళ్లపల్లి, పరిటాలవారిపాలెం, కొమ్మాలపాడు, కుందుర్రు, మక్కెనవారిపాలెం గ్రామాల్లో శుక్రవారం రైతు సాధికారత గ్రామసభలు నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రైతులు అధికారులను నోటీసుల సంగతి తేల్చాలని నిలదీశారు. కుందుర్రుల్లో తహశీల్దార్ బీ గంగాధరరావు పర్యవేక్షణలో నిర్వహించిన సభలో రైతులు వేదిక వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ‘అన్ని రోగాలకు ఒకటే మందన్నట్లుగా మీరేమో బంగారు రుణాలను కూడా ఐదు భాగాలు చేసి ఐదో వంతు జమ చేస్తారంటున్నారు. ఇలా అయితే బంగారంపై అప్పు పోయేదె ప్పుడు.. వారు మాకు బంగారు నగలు ఇచ్చేదెప్పుడు’ అని ప్రశ్నించారు. ఈవిషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అక్కడే ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం పొందిన తరువాత రెండేళ్ల వరకే గడువు ఉంటుందని..ఆ తరువాత వేలం నోటీసులు ఇస్తామన్నారు. 300 మంది గడువు మీరిన వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.