breaking news
Areas affected by the storm
-
పర్యవేక్షణకు ‘జన్మభూమి కమిటీలు’
తుపాను సాయంపై సీఎం చంద్రబాబు ప్రకటన రేపు సాయంత్రానికల్లా చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం రేపే విశాఖ బీచ్లో ‘తుపానును జయిద్దాం’ ర్యాలీ వాకతిప్ప పేలుళ్ల మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో బాధితులకు అందించే పరిహారం పంపిణీ పర్యవేక్షణ అధికారాలను.. ‘జన్మభూమి- మా ఊరు’ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలకే అప్పగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. న్యాయ సమ్మతంగా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కమిటీలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాయన్నారు. బాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పంటల నష్టం, ఇళ్ళు నష్టం తదితరాల అంచనాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 400 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. నష్టం అంచనా వివరాల్ని ఎన్ఆర్ఎస్ఏ డేటాతో అనుసంధానం చేసి నిజమైన అర్హుల్ని గుర్తిస్తామన్నారు. రేపటికల్లా బాధితులందరికీ సాయం... ఈ నెల 22 సాయంత్రానికి తుపాను కారణంగా నష్టపోయిన చిట్ట చివరి బాధితుడికి సాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. బాధితులకు అందించే సాయం పరిమాణాన్ని రెండు విభాగాలుగా విభజించామని.. తీవ్రంగా నష్టపోతే ఒక కేటగిరీ కింద, మిగిలిన నష్టానికి మరో కేటగిరీ కింద సాయం అందిస్తామని తెలిపారు. తుపాను బాధిత ప్రజలకు ఏ ఏ సరుకులు ఇస్తున్నామో.. ఫ్లెక్సీలు రూపొందించి చౌక ధరల దుకాణాల ఎదుట ఉంచుతున్నామని, అంతేకాకుండా ఆటోల, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు అంటే 22వ తేదీ (బుధవారం) విశాఖలోని ఆర్కే బీచ్లో కొవ్వొత్తులు, కాగడాలతో ‘తుపానును జయిద్దాం’ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 78 సార్లు తుపాన్లు వచ్చాయని.. వాటిని ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రుణవిముక్తికి ఇక బ్యాంకులదే ఆలస్యం... రైతుల్ని రుణ విముక్తి చేసేందుకు విజయవాడలో మంగళవారం రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్లుడ్వాక్రా మహిళల రుణాల మాఫీకి త్వరలో ఓ సాధికారిత సంస్థను ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు. ఇసుక పాలసీపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని, డ్వాక్రా సంఘాల ద్వారా ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో ఇసుక రీచ్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూనిట్ ఇసుకను రూ. వెయ్యికే అందిస్తామన్నారు. ఎర్రచందనం, బెరైటీస్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో బాణా సంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 11 మంది మృతి చెందటం ఎంతో బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించానని సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం ప్రకటించారు. సాధికారిక సంస్థకు 5 వేల కోట్లు విడుదల రైతు రుణ విముక్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ(ఆర్ఎస్ఎస్)కు రూ. 5 వేల కోట్లను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ సంస్థలకు తుపాను ప్రాంతాల దత్తత... తుపాను బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని, అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు ఈ విపత్తు సాయం రానందున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చెప్పారు. తుపాను ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు దత్తతకు ఇస్తామని, వారిచ్చే డబ్బుకు, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అన్ని వసతులతో, కాలనీలు నిర్మిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్షిప్పులు, గ్రామాల్లో ఆదర్శ కాలనీలు నిర్మిస్తామన్నారు. -
నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటన
విశాఖపట్నం: ఏఐసీసీ ఉపాధ్యక్షు డు రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాం ధ్రలోని తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. శనివారం విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్సాసత్యనారాయణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్న రాహుల్ ఆదివారం ఉదయం 11.30గంటలకు స్టీల్ప్లాంట్, 12.30 గంట లకు తాటిచెట్లపాలెంలో బాధితులను పరామర్శించి 1.45గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడం, 2.15 గంటలకు పెదకవలవాడల, సాయంత్రం 4.45కు విశాఖ సిటీలోని ఏడుగుళ్ల పాలెం, 5.30 గంటలకు టర్నర్ చౌల్ట్రీ ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. రాత్రి ఏడుగంటలకు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం చేస్తారని వివరించారు. -
నేడు ప్రధాని ఏరియల్ సర్వే
అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులతో సమీక్ష హైదరాబాద్/న్యూఢిల్లీ: హుదూ ద్ తుపాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విశాఖపట్నానికి రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటా రు. అక్కడి నుంచి నేరుగా 1.15కు ఏరియర్ సర్వేకు బయలుదేరి వెళతారు. ఏరియల్ సర్వేలో ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీనియర్ అధికారులు ఉంటారు. 2.05 గంటలకు తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించనున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, అన్ని శాఖల అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. 3.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ప్రధాని విశాఖపట్నం చేరుకుంటారు. తుపాను వల్ల సంభవించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించటంతో పాటు తుపాను నష్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న విమానం ద్వారా ప్రధాని పరిశీలిస్తారని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. తుపానుపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి హుదూద్ పెనుతుపాను, ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సహాయక చర్యలు తీరుతెన్నులపై వాకబు చేశారు. రహదారులు, రైల్వే లైన్లు, భవనాలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ లైన్లు నష్టం వాటిల్లిందని ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. పంటనష్టంపై మరికొద్ది రోజుల్లో అంచనా వేయనున్నట్టు తెలిపారు. పునరావాస కల్పన, బాధితులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మోదీ ఆదేశించారు.