మనోళ్లు ఇక్కడే...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు తెరపడింది. అఖిల భారత సర్వీసుల అధికారుల(ఏఐఎస్) విభజన ప్రక్రియలో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ శుక్రవారం ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీంట్లో మన జిల్లాలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ కేడరే కేటాయించగా, గ్రామీణ ఎస్పీగా వ్యవహరిస్తున్న రాజకుమారిని సొంత రాష్ట్రమైన ఏపీకి కేటాయించారు.
ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్ల సమక్షంలో పంపకాల ప్రక్రియ పూర్తిచేశారు. విశ్వసనీయవర్గాల ప్రకారం వివరాలిలా ఉన్నాచి స్థానికత ఆధారంగా నే రుగా నియమితులైన ఐఏఎస్ అధికారులను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించగా, ప్రమోటీల విషయంలో మాత్రం కేడర్ స్ట్రెంత్ను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో నిర్ధేశిత సంఖ్య కంటే అధికంగా ప్రమోటీ లు తెలంగాణలో ఉండడంతో వీరిలో కొందరిని ఏపీకి పంపాలని ప్రత్యుష్ సిన్హా కమిటీ భావించింది.
దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్లు, ప్రమోటీలయిన ఎంసీ లాల్, ఎంవీరెడ్డిలకు స్థానచలనం తప్పదనే ప్రచారం జరిగింది. ఈ దశలోనే జేసీ-1 ఎంసీ లాల్ను ఆంధ్రకు కేటాయించారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఒకింత ఉద్వేగానికి లోనైన ఆయన... ఈ సమాచారాన్ని నిర్ధారణ చేసుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించారు. చివరకు ఆయనను సొంత రాష్ట్రానికే కేటాయించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రంగారెడ్డి గ్రామీణ ఎస్పీగా వ్యవహరిస్తున్న రాజకుమారి స్వస్థలం ఏలూరు.
ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ కేడర్ దక్కింది. తమిళనాడుకు చెందిన వికారాబాద్ సబ్కలెక్టర్ హరినారాయణ్ను కూడా ఆంధ్రకే కేటాయించారు. వీరిద్దరికి త్వరలో ఆ రాష్ట్రంలో పోస్టింగ్ లభించనుంది. నేరుగా ఐఏఎస్గా ఎంపికైన కలెక్టర్ శ్రీధర్కు ‘స్థానికత’ ఆధారంగా మన రాష్ట్ర కేడరే లభించింది. రాత్రి పొద్దుపోయేవరకు ఏఐఎస్ అధికారుల పంపకాల ప్రక్రియను పూర్తి చేసిన సిన్హా కమిటీ... వెబ్సైట్లో జాబితాను పొందుపరిచింది.