వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా?

వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా? - Sakshi


కొమ్మినేని శ్రీనివాసరావుతో  సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌

వైఎస్‌ జగన్‌ని కంట్రోల్‌ చేయాలని ఉన్నవీ లేనివీ అన్నీ అసాధారణ కేసులు పెట్టించి డీమోరలైజ్‌ చేసేస్తే మళ్లీ సరెండర్‌ అయిపోతాడని అందరూ అను కున్నారు. కానీ వైఎస్సే మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్‌. సరెండర్‌ కాదు కదా, ఇంకా మొండెక్కిపోయాడాయన. మొండి వాడిని జగమొండిని చేసినట్లయిపోయింది పరిస్థితి.



ఒకే ఒక వ్యక్తి (వైఎస్‌ఆర్‌) ఉన్నట్లుండి పోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రం చరిత్రే మారి పోయిందని హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌ అంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన నావను తానే ముంచుకుందని, ఒక రాష్ట్ర భవిష్యత్తు వంటి కీలక నిర్ణయంపై అధిష్టానానికి తప్పుడు రిపోర్టు ఇస్తే ఆ నష్టాన్ని ఇప్పుడు పార్టీ మొత్తంగా అనుభవించాల్సి వస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ విషయంలో అధిష్టానానికి విషం నూరిపోయ టంతో ఆయన పార్టీలోంచే బయటకు వెళ్లారని, ఇటు తెలంగాణలో అటు ఏపీలో తప్పుగా వ్యవహరించడమే కాంగ్రెస్‌ పార్టీకి పెను నష్టం కలిగించిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పదని తేలాక ఒకటిన్నర సంవత్సరం ముందే ఏపీ, తెలంగాణలకు ఇద్దరు సీఎంలను నియమించి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రకు తప్పుడు కలర్‌ ఇవ్వడమే కాంగ్రెస్‌ భంగపాటుకు కారణమైందంటూ దానం నాగేందర్‌ ‘‘మనసులో మాట’’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..



కాంగ్రెస్‌ రాజకీయాలు సడన్‌గా ఇలా మారిపోయాయేమిటి?

రాజకీయాలు మారలేదండి. ఒక వ్యక్తి పోవడం వల్ల ఇంత తేడా వచ్చింది. వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇలా అయ్యేది కాదు. ఒక్క వ్యక్తివల్లే, ఆయన లేక పోవడం వల్లే ఇంత దుస్థితి వచ్చిందనేది జనం మాట.



తెలంగాణ అంశంలో ఎవరు కరెక్ట్‌.. మీరా, అధిష్టానమా, కిరణా?

అధిష్టానానికి తెలంగాణ గురించి చెప్పేవాళ్లు తప్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటిన్నర సంవత్సరానికి ముందు ఇచ్చి, కావలసిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. రెండు రాష్ట్రాలను చేసి, వాటికి ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. టీఆర్‌ఎస్‌కు కొంచెం శక్తి వచ్చినా, ఆం్ర«ధలో మేము దెబ్బతిన్నా.. పర్వాలేదు. అప్పటికే జగన్‌ వల్ల ఏపీలో కాంగ్రెస్‌కు నష్టమే. అక్కడ కాంగ్రెస్‌ రాదు. కనీసం ఇక్కడయినా పార్టీ అధికారం లోకి వస్తుందని అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చేసి ఉంటే  ప్రచారం చేసుకునేవాళ్లం. కానీ ఆరుమాసాల ముందు ఇచ్చారు. మూడు మాసాల ముందు ప్రెసిడెంట్‌ రూల్‌ పెట్టారు. కాంగ్రెస్‌ తన నావను తానే ముంచుకుంది. మేం చేసిన తప్పుకు మేమే అనుభవించాల్సి వస్తోంది.  



జగన్‌నే సీఎంని చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు లెటర్‌ ఇచ్చారు కదా?

ఆ రోజు జరిగిందేమిటంటే ‘జగన్‌ కొంచెం ఎక్సెంట్రిక్‌. మాట వినడు. ఎవరినీ కేర్‌ చేయడు. ఇప్పుడు జగన్‌ని సీఎం చేయొద్దు’ అని ఢిల్లీకి వెళ్లి విషం చిమ్మేశారు. జగనేంటి చిన్న పిల్లగాడు కదా. అప్పుడే సీఎం ఏంటి అని అడ్డుపుల్లలేశారు. కాంగ్రెస్‌కు అసలే పెద్ద చెవులు. ఎవరేది చెప్పినా దాని చెవుల్లోకి వెళ్లిపోతుంది. ఇంతమంది చెప్పగానే అమ్మో జగన్‌కి సీఎం పదవి ఇవ్వడం డేంజరా.. అనుకుని వ్యతిరేక నిర్ణయాలకు వచ్చే శారు. దాంతో తన ఉనికిని తాను కాపాడుకోవాలని జగన్‌ భావించారు. ‘ఓదార్పు యాత్రలో తప్పేముంది మేడమ్‌’ అని అడి గారు. జగన్‌ ఓదార్పు యాత్రకూ మావాళ్లు తప్పుడు భాష్యం చెప్పారు.


జగన్‌ సొంతంగా పార్టీ పెడితే కేసులు పెడ తారా? అవి పొలిటికల్‌ కేసులు కావా?
మొదటినుంచి ఇదే చెబుతున్నా. జగన్‌ని కంట్రోల్‌ చేయాలంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని రకరకాల సలహాలు ఇచ్చి, ఉన్నవీ లేనివీ.. అన్నీ అసాధారణ కేసులు పెట్టించి ఆయన్ని డీమోరలైజ్‌ చేసేస్తే మళ్లీ అధిష్టానానికి సరెండర్‌ అయిపోతా డని అందరూ అనుకున్నారు. కానీ మొండోడి విషయంలో అలా జరుగుతుందా? ముందే ఆయన మొండోడు. రాజశేఖరరెడ్డే ఒక మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు  జగన్‌. రాత్రి పగలు అని తేడా ఉండదు. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది అయిపోయేంతవరకు ఇక ప్రజల్లోనే ఉంటాడు. వైఎస్‌దీ అదే స్వభావం. ప్రజలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఎవరు చెప్పినా వినేటోడు కాదు. మరి వైఎస్‌ కుమారుడు కాబట్టి ఆయన వారసత్వం జగన్‌ కొనసాగించాలి కదా. అదే జరిగింది.

ఇలా కేసులు పెట్టడం, వేధించడం తప్పు అని అధిష్టానానికి మీరెప్పుడూ చెప్పలేదా?
అధిష్టానానికి తెలియదని కాదు. జగన్‌కి చాలామంది నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు. కొందరు కేసులు పెడితే మళ్లీ మనకే సరెండర్‌ అవుతాడని చెప్పారు. కానీ సరెండర్‌ కాదు కదా. ఇంకా మొండెక్కి పోయాడు. మొండివాడిని జగమొండిని చేసినట్ల యింది పరిస్థితి.

ఆ కేసులన్నీ నిలిచేవి కాదని తెలిసి కూడా అలా ఎందుకు పెట్టారు?
నిలిచినా నిలవక పోయినా ఒక మాటండీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది కదా. కేసులు పెట్టించి, భయపెట్టించి, అదిచేసి ఇది చేసి అందరినీ లాక్కుపోతున్నారు. ఏ పార్టీకయినా ఇది దీర్ఘకాలంలో నడ వదు. రాజకీయంగా ఎదుర్కోవాలి.
 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం?
 పాదయాత్ర చేయడానికి ముందు ఆయన చాలా దూకుడుగా ఉండేవారు. ఘర్షణ చెలరేగిన సందర్భాల్లో మాలాంటివాళ్లం ఆయనను శాంతపరచి సర్దిచెప్పాల్సి వచ్చేది. కానీ అధికారంలోకి వచ్చాక వైస్సార్‌ ఎంతగా మారిపోయారంటే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడు తున్నా నవ్వుతూ ఉండేవారు. అప్పట్లో నేను అసెంబ్లీలో వైఎస్‌ పక్కసీటులోనే కూచునేవాడిని. ఒకసారి మాటల సందర్భంలో ‘పాత రాజశేఖరరెడ్డి ఎక్కడికి పోయాడు?’ అని అడిగేశాను. ‘నాగేందర్‌..! ఇతరులు విమర్శ చేస్తుంటే మనం వినా ల్సిన సమయమిది. అధికారం ఉంది కదా అని  మనం ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, రెచ్చిపోయినా ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోరు. విమర్శించేవారు చెప్పాలనుకున్నది చెప్పనిద్దాం. తర్వాత నేను ఎలాగూ సమాధానం ఇస్తాను కదా’ అనేవారు.

ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం సానుకూల పరిస్థితిని కూడా మీరు ఉపయోగించు కోలేక పోయారు కదా?
విభజన ఖాయమయ్యాక సోనియాగాంధీ, కేసీఆర్‌తో మాట్లాడి.. తర్వాత జరగా ల్సిన దానిపై చర్చిద్దాం అన్నారు. కానీ మావాళ్లేం చేశారు? కేసీఆర్‌కెందుకు సీఎం పదవి ఇవ్వడం, మేం లేమా? అని సీఎం  పదవిపై ఆశ ఉన్నోళ్లంతా మొత్తంగా మళ్లీ ఢిల్లీకి ఉరికారు. మేమిన్ని రోజులుగా సేవ చేస్తుంటే కేసీఆర్‌కి సీఎం పదవి ఎలా ఇస్తారని అడ్డుకున్నారు. కాంగ్రెస్‌లో రెండేళ్ల కంటే ఎవరినయినా సీఎం పదవిలో పెడతారా? మూడో సంవత్సరం కూడా సీఎంగా ఉంటే గొప్ప అనుకోవాలి. వైఎస్సార్‌ మాత్రమే అన్నేళ్లు చేయగలిగారు.

ఇప్పుడు మీ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు?
మా పార్టీలో ఉన్నది చెప్పకూడదు. లేనిది చెపితేనే జల్దీగా నమ్ముతారు. సీఎం అభ్యర్థులు ఇప్పుడెందుకు పుడతారు? కాంగ్రెస్‌లో విశేషం ఏమిటంటే టైమ్‌ చూసి వచ్చే స్తారు మళ్లీ. పవర్‌ వస్తుందీ అనగానే మళ్లీ తయారయిపోతారు కాబోయే సీఎం క్యాండిడేట్లంతా.. వెట్టి చాకిరీ చేసేటోడికేమో గుర్తింపు ఉండదు. ఏం చేయనోడికి ఎక్కడ లేని గుర్తింపూ ఉంటుంది. కేసీఆర్‌లాగా పార్టీని నడిపేవారేరీ కాంగ్రెసులో. రాజశేఖరరెడ్డి విషయం చూస్తే మొత్తం పార్టీని తానే నడిపారు. అలాంటి నాయకులేరీ ఇప్పుడు?
(దానం నాగేందర్‌తో పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top