బతుకు బంతిపూల బాట! | profit with cultivation of the flower ball | Sakshi
Sakshi News home page

బతుకు బంతిపూల బాట!

Sep 15 2014 11:05 PM | Updated on Sep 2 2017 1:25 PM

బంతి పూల సాగుతో లాభాల బాట సాగుతున్నామంటున్నారు మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన రైతులు.

బంతి పూల సాగుతో లాభాల బాట సాగుతున్నామంటున్నారు మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన రైతులు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే బంతి తోటల సాగు లాభదాయకమేనంటున్నారు వారు. ఈ సందర్భంగా బంతి, చామంతితో పాటు పలు రకాల పూల తోటలు సాగు చేయడానికి వర్షాకాలం అనుకూలంగా ఉంటుందని, ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు బంతి నారును నాటుకోవచ్చంటున్నారు మేడ్చల్ ఉద్యాన శాఖ అధికారి శైలజ. బంతి పూల తోటలు వేసుకునే రైతుల కోసం శైలజ సూచనలు, సలహాలు అందించారు.
 
 తేలికపాటి నేలల్లో...
 బంతి నారును తేలికపాటి అనువైన నేలల్లో నాటుకోవాలి. మిరప, పత్తి, పంటల్లోనూ అంతర పంటలుగా కూడా బంతి సాగు చేసుకోవచ్చు. వాణిజ్యపరంగా సాగు చేయడానికి ఆఫ్రికన్ రకాల మొక్కలు ఎత్తుగా పెరిగి పెద్ద ైసైజు పూలు పూస్తాయి. ఆఫ్రికన్ ఎల్లోజాయింట్ డబుల్ క్రాక్‌జాక్, గోల్డేన్‌ఫజ్, పూసానారంగి, గ్రైండా రకాలు అనువైనవి. ఫ్రెంచి బంతిలో రెడ్‌బ్రోక్ట్, రస్టిన్ రెడ్, బట్టర్‌స్కాట్, వాలెన్సియా రకాలు అనువుగా ఉంటాయి. నారింజ, గ్రైండా, పూసా, బ్రసంతి యండీయా-1 బంతి రకాలు మంచివి.  

 నారుమడి పద్ధతి..
 ఎకరా విస్తీర్ణంలో బంతి మొక్కలు నాటడానికి 600- 800 గ్రాముల విత్తనాలతో పెంచిన నారు అవసరం. ఎత్తుగా నారుమడులు చేసుకుంటే మొక్కల మధ్యన సమాన దూరం ఉంటుంది. ఇలా దూరం పెంచుకుంటే కలుపు, చీడపీడల నివారణకు తేలికగా ఉంటుంది. మొక్కల వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 25 సెంటీ మీటర్ల దూరం పెంచుకుని నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడితో పాటు నాణ్యత ఉంటుంది. నాటిన తర్వాత పలుచగా నీరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.

పూల అధిక దిగుబడి కోసం ఎరువులు ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల నత్రజని, 20 కిలోల బాస్వరం, 35 కిలోల పోటాషియం చల్లాలి. మొక్కలు ఏపుగా పెరుగుతున్న సమయంలో 20కిలోల నత్రజని పైపై వేసుకోవాలి.  నాటిన 60 రోజుల వరకు మొక్కలు పెరిగే దశల్లో ఉంటాయి.   భూమిలో తగినంత తేమ ఉండేందుకు నేల స్వభావాన్ని బట్టి 5-8 రోజులకోసారి నీటిని పట్టాలి.  

 సస్యరక్షణ...
 బంతి మొగ్గ తొలిచే పురుగు, తామరపురుగు, నారుకుళ్లు ఆశించే ప్రమాదం ఉంటుంది. మొగ్గతొలిచే పురుగులు లార్వాలు పూమొగ్గలను తొలిచేస్తాయి. దీంతో మొగ్గ విచ్చుకోకపోవడంతో దిగుబడి తగ్గుతుంది. వీటి నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్, ఎండోసల్ఫాన్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు లేతగోధుమ రంగుకు మారుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ లేదా డైమిథోయెట్‌ను పిచికారీ చేయాలి. తెగులు నివారణకు లీటర్ నీటికి 2 గ్రా. కాప్ట్రాన్, 1.5 గ్రాముల కార్భండైజమ్ ద్రావణంతో నారుమడిని తడపాలి. సకాలంలో సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement