
వారసత్వ షేర్ల దూకుడు
తదుపరి తరం బిజినెస్ లీడర్లకు వారసత్వంగా లభించిన షేర్లు లాభాల దూకుడును ప్రద ర్శిస్తున్నాయి.
న్యూఢిల్లీ: తదుపరి తరం బిజినెస్ లీడర్లకు వారసత్వంగా లభించిన షేర్లు లాభాల దూకుడును ప్రద ర్శిస్తున్నాయి. ఈ జాబితాలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోలతోపాటు ఫార్మా దిగ్గజం సన్ తదితరాలున్నాయి. కుటుంబానికి చెందిన లేదా సంస్థలు, ట్రస్ట్ల చేతిలో ఉన్న షేర్లను పరిగణించకుండా చూస్తే... 40 ఏళ్లలోపు పిల్లలకు ప్రమోటర్ల నుంచి వారసత్వంగా అందిన షేర్ల విలువ 2013లో రూ. 14,000 కోట్లకు ఎగసింది. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో ఉంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల పిల్లల వద్దనున్న సంయుక్త షేర్ల విలువ 50% జంప్చేసి రూ. 10,720 కోట్లకు చేరింది. దీనిలో నారాయణ మూర్తి సంతానం అక్షత, రోహన్ మూర్తిలకున్న వాటా విలువ రూ. 5,700 కోట్లను తాకగా, నందన్ నీలేకని సంతానం నిహార్, జాహ్నవిల వాటా విలువ రూ. 1,200 కోట్లకు చేరింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన గణాంకాల ప్రకారం ఇన్ఫోసిస్ సహప్రమోటర్ క్రిస్ గోపాలకృష్ణన్ కుమార్తె మేఘన వాటా రూ. 215 కోట్లకు, కె.దినేష్ కుమార్తెలు దివ్య, దీక్షల వాటా రూ. 980 కోట్లకు, ఎస్డీ శిబూలాల్ కుమార్తెలు శ్రుతి, శ్రేయాల వాటా రూ. 2,610 కోట్లకు ఎగసింది. ఈ బాటలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ కుమారులు రిషద్, తారిఖ్లకున్న షేర్ల విలువ సైతం 40% లాభపడింది. విప్రో ఐటీ బిజినెస్కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా పనిచేస్తున్న రిషద్కున్న 6.87 లక్షల షేర్ల విలువ రూ. 38 కోట్లను తాకగా, తారిఖ్ వాటా విలువ రూ. 15 కోట్లయ్యింది. ఇక సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ కుమారుడు ఆలోక్ సంఘ్వీ, అతని సోదరి విధికున్న సంయుక్త వాటా విలువ 55% పుంజుకుని రూ. 330 కోట్లకు చేరింది. సన్ ఫార్మా అంతర్జాతీయ మార్కెటింగ్ టీమ్కు జనరల్ మేనేజర్గా ఆలోక్ పనిచేస్తున్నారు.
గోద్రెజ్ వారసులూ ఉన్నారు...
సిప్లా ప్రమోటర్ ఎంకే హమీద్ సంతానం కమిల్, సమీనాల వాటా నామమాత్ర వృద్ధినే సాధించింది. దీంతో సిప్లాలో వీరి వాటా విలువ 2012లో నమోదైన రూ. 850 కోట్ల స్థాయిలోనే ఉండిపోయింది. మరోవైపు ముకేశ్ అంబానీ సంతానం ఈషా, ఆకాశ్, అనంత్లకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్ల విలువ సైతం పెద్దగా మార్పులు లేకుండా రూ. 600 కోట్ల వద్దే నిలిచిపోవడం గమనార్హం. కాగా, అనిల్ అంబానీ సంతానమైన జైఅన్మోల్, జైఅన్శూల్కున్న అడాగ్ కంపెనీల వాటా విలువ రూ. 31 కోట్లుగా నమోదైంది.
ఆర్కామ్ విలువ పుంజుకోగా, రిలయన్స్ క్యాప్, రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ల ధరలు క్షీణించడమే దీనికి కారణం. ఇక గోద్రెజ్ వారసులు తన్య, పిరోషా, నిసబ, ఫిరోజ్లకున్న గోద్రెజ్ ఇండస్ట్రీస్లో 13% వాటా, గోద్రెజ్ క న్జూమర్లో 17% వాటాల విలువ రూ. 960 కోట్లకు చేరింది. ఇదే విధంగా ఓపీ జిందాల్ గ్రూప్లోని తదుపరితరం నాయకులు తరిణి, తన్వి, పార్థల వాటాల విలువ కాస్త తగ్గి రూ. 560 కోట్లకు పరిమితమైంది. వీరికి జేఎస్పీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీలలో వాటాలున్నాయి. ఇక ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా కుమారుడు అనంత్కు సియట్, కేఈసీ ఇంటర్నేషనల్లో ఉన్న వాటా విలువ కూడా పెద్దగా లాభపడింది లేదు. ఇందుకు సియట్ షేరు పుంజుకున్నప్పటికీ, కేఈసీ దిగజారడం కారణంగా నిలిచింది. అయితే వోకార్డ్ ప్రమోటర్ హబీల్ కోర్కీవాలా కుమారులు ముర్తజా, హోజిఫాలకున్న వోకార్డ్ షేర్ల విలువ 70% తరిగిపోయింది. వోకార్డ్ షేరు ఆ స్థాయిలో పతనంకావడం ప్రభావం చూపింది.