అక్రమ కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు ఈనెల 31 (గురువారం)తో ముగిసిపోనుంది.
* నేటితో ముగియనున్న గడువు
* సీఎం కేసీఆర్ అనుమతి కోసం పురపాలక శాఖ నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు ఈనెల 31 (గురువారం)తో ముగిసిపోనుంది. గడువు మరో రెండు నెలలు పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అనుమతి కోసం పురపాలక శాఖ బుధవారం సాయంత్రం వరకు నిరీక్షించింది.
శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ను క్యాంపు కార్యాలయంలో కలసి గడువు పెంపునకు అనుమతి కోరారు. ఈ అంశంపై గురువారం చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. గురువారం అనుమతి లభిస్తే ఆ వెంటనే అంతర్గత ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలాఉండగా, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టిందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ పథకాల కింద దరఖాస్తుల స్వీకరణకు అనుమతించిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాటిని పరిష్కరించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల గడువు పెంచుకోడానికి అడ్డంకులు లేవని అధికారులు చెబుతున్నారు.
స్పందన అంతంతే...
అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆశించిన స్పందన రాలేదు. అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా ఏకంగా రూ.1,000 కోట్ల ఆదాయాన్ని గడించాలన్న జీహెచ్ఎంసీ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికల పరిధిలో నామమాత్రపు సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 వరకు లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 65,079 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణ కోసం 62,659 దరఖాస్తులు వచ్చాయి.
తొలుత దరఖాస్తుతోపాటు కనీసం రూ.10 వేల డీడీని సమర్పించాలని, మిగిలినరుసుమును పరి ష్కార సమయంలో చెల్లించాలని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేర కు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.48.79 కోట్లు, బీఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.37.89 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిని పరిష్కరిస్తే ఆదాయం రూ.1,000 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.