
టీవీ నటుడి ప్రాణం తీసిన డ్రైనేజీ గుంత
రోడ్డు పక్కన డ్రెనేజీ కోసం తీసిన గోతిలో పడి టీవీ నటుడు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని బసవనగుడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: రోడ్డు పక్కన డ్రెనేజీ కోసం తీసిన గోతిలో పడి టీవీ నటుడు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని బసవనగుడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇట్టుమడులో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ (55) కన్నడ సీరియల్స్లో నటిస్తున్నాడు. ఈయన శనివారం శ్రీ హనుమ జయంతి సందర్భంగా చిత్రదుర్గ జిల్లా హొసదుర్గలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం వేకువ జామున బెంగళూరు చేరుకున్నారు. అనంతరం బైక్పై ఇంటికి బయలుదేరారు.
మార్గం మధ్యలో బసవనగుడి సమీపంలోని రామకృష్ణ రోడ్డులోని నారాయణస్వామి సర్కిల్లో రోడ్డు పక్కన డ్రెయినేజీ కోసం గుంత తీశారు. అక్కడే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అశోక్ వేగంగా వస్తూ అదుపుతప్పి బ్యారికేడ్లను ఢీకొని బైక్తో సహా గోతిలో పడి మృతి చెందాడు. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. అశోక్కుమార్.. పల్లవి అనుపల్లవి, ముక్త ముక్త తదితర సీరియల్స్లో నటించారు. అశోక్ కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.