నోట్ల రద్దుకు ఓ ఎనిమిదేళ్ల బాలుడు బలి
కేంద్రం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుకు జమ్మూకశ్మీర్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించాడు.
శ్రీనగర్ : కేంద్రం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుకు జమ్మూకశ్మీర్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించాడు. కొత్త కరెన్సీ నోట్లు దొరకక, పాత కరెన్సీ నోట్లు ఎవరూ అంగీకరించకపోవడంతో, మున్నీర్ అనే బాలుడిని తన తండ్రి దాదాపు 30 కిలోమీటర్ల మేర భుజాలపై ఎత్తుకుని ఆసుప్రతికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రికి తీసుకొనివెళ్లే లోపే ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిపోయాయి. వివరాలోకి వెళ్లే.. మొహమ్మద్ హరూన్ అనే వ్యక్తి, న్యూమోనియాతో బాధపడుతున్న తన కొడుకు మున్నీర్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గత కొన్ని రోజులుగా కొత్త కరెన్సీ నోట్లకోసం తన ఊరు బాబూన్కు దూరంగా ఉన్న కూన్ బ్యాంకు బ్రాంచుకు కాలు అరిగేలా తిరిగాడు. కానీ కొత్త కరెన్సీ నోట్లు మాత్రం హరూన్కు దొరకలేదని ఆయన కుటుంబసభ్యుడు అన్వర్ చౌదరీ తెలిపాడు. బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో కొత్త కరెన్సీ నోట్లు సంపాదించడం అతనికి కష్టతరంగా మారిందని కుటుంబసభ్యులు చెప్పారు. కొత్త కరెన్సీ నోట్లు దొరకక పోవడంతో నడకబాటలోనే శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటలప్పుడు తండ్రికొడుకులిద్దరూ ఆసుపత్రికి బయలుదేరానని వారు పేర్కొన్నారు.
కొంత దూరం వెళ్లాక మున్నీర్ ఆరోగ్యం క్షీణించిందని, దీంతో కొడుకును భుజాలపై ఎత్తుకుని హరూన్ మళ్లీ నడక ప్రారంభించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కూన్ గ్రామంలో ఓ క్యాబ్ను ఆశ్రయించగా.. అతను పాత కరెన్సీ నోట్లను నిరాకరించాడు. దీంతో మరో నాలుగు గంటలకు పైగా కొడుకును భుజాలపై మోస్తూనే మాన్సెర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే మార్గం మధ్యలోనే మున్నీర్ మరణించినట్టు డాక్టర్ తెలిపడంతో హరూన్ కన్నీరుమున్నీరయ్యాడు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఓ వెహికిల్ కల్పించడంతో మున్నీర్కు నవంబర్ 19న అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న సాంబ జిల్లా మెజిస్ట్రేట్ సీతల్ నందా విచారణకు ఆదేశించారు. విచారణలో పూర్తివివరాలు తెలుస్తాయని ఆమె చెప్పారు. గుజ్జర్, బేకర్వాల్ గిరిజన్ సంచార కమ్యూనిటీలో చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవని, పెద్ద నోట్ల రద్దుతో వారు ఇబ్బందులు పడుతున్నట్టు గిరిజన్ పరిశోధన, సాంస్కృతిక ఫౌండేషన్ చైర్పర్సన్ జావీద్ రహి తెలిపారు. చాలామంది గుజ్జర్లకు, బేకర్వాల్స్కు ఇప్పటివరకు కేంద్రనిర్ణయంపై ఏమాత్రం అవగాహన లేదని, కష్టించి సంపాదించిన సంపదను వారు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.