ఇద్దరు సీఎంలు దోషులే..


 గుండాల : రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులిద్దరూ దోషులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. శనివారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పదవులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రులు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను పక్కతోవ పట్టించడానికి ఓటుకు కోట్లు పేరుతో ఒకరు, ఎమ్మెల్యేలు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మరొకరు కపట నాటకాలు ఆడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చడాన్ని మరిచి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.


వేల కోట్లతో ప్రారంభించిన చెరువుల పూడికతీత పనులు ఎక్కడ పూర్తయ్యాయో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ కాకతీయలో అక్రమంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. మాయమాటలు చెప్పి పార్టీలు మార్చేందుకు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ దుంపల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మాదరబోయిన సునీత, తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top