అట్ల ఇచ్చె.. ఇట్ల గుంజుకునె! | there is no use for old age pensions! | Sakshi
Sakshi News home page

అట్ల ఇచ్చె.. ఇట్ల గుంజుకునె!

Dec 11 2014 1:27 AM | Updated on Sep 2 2017 5:57 PM

అట్ల ఇచ్చె.. ఇట్ల గుంజుకునె!

అట్ల ఇచ్చె.. ఇట్ల గుంజుకునె!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు తయారైంది పింఛ న్ల పంపిణీ!

వరంగల్/నిజామాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు తయారైంది పింఛ న్ల పంపిణీ! దిక్కుమొక్కూ లేని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బులను పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఎన్నో సర్వేలు, వడపోతలు, ఎంతో ఎదురుచూపుల తర్వాత చేతికందుతున్న పింఛన్ సొమ్ము నుంచి.. నల్లా బిల్లు, ఇంటి బిల్లు, ఇతర బిల్లులు అంటూ డబ్బులు గుంజుకుంటున్నాయి. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక గ్రామపంచాయతీల్లో ఈ తంతు కొనసాగింది. దీంతో పింఛన్ సొమ్ము అందిందన్న లబ్ధిదారుల ఆశ అక్కడికక్కడే ఆవిరవుతోంది. వరంగల్ జిల్లా రఘునాథపల్లి, ధర్మసాగర్, కేసముద్రం మండలాల పరిధిలోని గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు... పింఛన్ లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి నల్లా, ఇల్లు తదితర పన్నులు వసూలు చేశారు.

 

దీన్ని ధర్మసాగర్ ఎంపీడీవో రాజారావు దృష్టికి తీసుకురాగా...పింఛన్ల నుంచి పన్నుల వసూళ్లు ఆపాలని కార్యదర్శులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇక నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ పంచాయతీ... ‘పింఛన్ వచ్చిన వారు పన్ను కట్టగలరు’ అంటూ కార్యాలయం ఎదుట నోటీసు అంటించారు.
 
 రశీదులు చింపి ఇచ్చిండ్రు
 ప్రభుత్వం రెండు నెలల పింఛన్ ఒకేసారి ఇస్తే... ఇంటి పన్ను పాతది, కొత్తది ఒకేసారి తీసుకున్నరు. రూ.3 వేలలో.. పన్నులు రూ.960 కట్టుకుని రశీదులు ఇచ్చిండ్రు. ‘ఇదేమిటి... ఊళ్ల ఉండనట్టే ఒకేసారి పన్ను తీసుకుంటారా..’ అని అడిగితే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ చెప్పిం డ్లని, మాదేం లేదని సిబ్బంది అంటున్నారు.
 - సిద్ధిరాములు, రఘునాథపల్లి, వరంగల్
 

Advertisement
 
Advertisement
Advertisement