‘సర్పంచ్ గ్రామ బహిష్కరణ’పై విచారణ | Sakshi
Sakshi News home page

‘సర్పంచ్ గ్రామ బహిష్కరణ’పై విచారణ

Published Wed, Aug 6 2014 3:29 AM

the inquiry on  'Boycott of the sarpanch from the village'

జక్రాన్‌పల్లి :  చింతలూర్ సర్పంచ్ శోభతోపాటు ఆమె భర్త సంతోష్‌లను గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు గ్రామ బహిష్కరణ చేశారన్న ఆరోపణలపై మంగళవారం నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. సర్పంచ్ శోభ, ఆమె భర్త సంతోష్‌లకు లక్ష రూపాయల జరిమానా విధించారని సాయమ్మ అనే మహిళ తెలిపింది. సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు మైక్ ద్వారా దండోరా వేయిం చారని పేర్కొంది. సర్పంచ్‌కు దుకాణాల్లో ఎలాంటి వస్తువులు ఇవ్వరాదని, సర్పంచ్‌కు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకోరాదని హెచ్చరించారని పోశన్న అనే వ్యక్తి తెలిపారు.

 వీడీసీ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటునుంచే నీళ్లు తెచ్చుకోవాల ని, కలిగోట్‌లో ఉన్న సర్పంచ్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోకూడదని మాత్రమే మైక్‌లో చెప్పించామన్నా రు. ఇసుక విషయంలో సర్పంచ్ భర్త సంతోష్ అధికారులకు ఫిర్యాదు చేశారని పెద్దోళ్ల గంగారాం తెలిపారు. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంతో అతడికి లక్ష రూపాయల జరిమానా విధించామని పేర్కొన్నారు.

 కానీ సంతోష్ ఆ జరిమానా చెల్లించలేదన్నారు. అదే సమయంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు పెద్దగా నినాదాలు చేశారు. గ్రామ బహిష్కరణ విధిం చిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వారిని సముదాయించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించరాదని వీడీసీ సభ్యులకు సూచించారు. డీఎస్పీ వెంట డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాయినాథ్ ఉన్నారు.

 బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి
 చింతలూర్ సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐకేఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చింతలూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్‌ను బహిష్కరించడం ఆటవిక చర్యన్నారు. వీడీసీ పేరుతో దళితులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయకపోతే గురువారం ఆర్మూర్‌లో నిర్వహించే సీఎం సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

 శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాం, దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు సంకెపల్లి బుచ్చన్న, వాడి ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement