చంద్రబాబు కుట్రలను అడ్డుకొని తీరుతాం 

Telangana Electric Engineers Association President Shivaji Comments On Chandrababu - Sakshi

తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంతోపాటు, సంస్థలూ రెండుగా విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో ఏపీ ఉద్యోగులను తిష్టవేయించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.శివాజీ ఆరోపించారు. ఆదివారం మింట్‌ కాంపౌండ్‌లోని టీఏఈఈఏ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో పాటు సంస్థలు విడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఏపీ ఇంజనీర్లు ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారని చెప్పారు.

వారంతా సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. వారిని ఇక్కడే కొనసాగించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలను దెబ్బతీసేందుకు కుట్రపన్నారన్నారు. స్వయంగా ఏపీ సర్కారే వారికి రవాణా, వసతి కల్పించి ఏకసభ్యకమిషన్‌ వద్దకు పంపి బలవంతంగా వారితో ఆప్షన్లు ఇప్పించిందని విమర్శించారు. ఏపీ ఉద్యోగులను ఇంకా ఇక్కడే కొనసాగించాలని చూస్తే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నర్‌ చొరవ తీసుకొని రెండు ప్రభుత్వాలతో మాట్లాడి, ఉద్యోగుల విభజన అంశాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top