40 మందితో బీజేపీ రెండో జాబితా
పార్లమెంటరీ కమిటీ ఆమోదం తర్వాత ప్రకటన
నేడు ఢిల్లీకి జాబితాతో పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల బరిలో దిగనున్న బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైంది. దాదాపు 40కి పైగా పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది. బుధవారం నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, కిషన్రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 మందికిపైగా పేర్లతో జాబితాను రూపొందించారు. దీనిని లక్ష్మణ్ గురువారం ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. అక్కడ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తర్వాత పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి దింపాలని పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయించింది.
అలాగే రంగా కిరణ్ (కొత్తగూడెం), దొంతిరి శ్రీధర్రెడ్డి (ఆలేరు), మాధవరం కాంతారావు (కూకట్పల్లి), బద్దం బాల్రెడ్డి (రాజేంద్రనగర్), యోగానంద్ (శేరిలింగంపల్లి), అశోక్గౌడ్ (ఇబ్రహీంపట్నం), పద్మజారెడ్డి (మహబూబ్నగర్), నాగూరావు నామోజీ (కొడంగల్), అమరేందర్రెడ్డి (వనపర్తి), దిలీపాచారి (నాగర్కర్నూల్), నర్సింహులు (దేవరకద్ర), ధర్మారావు (వరంగల్ వెస్ట్), అలె జితేంద్ర (మలక్పేట), రూప్రాజ్ (యాకత్పుర), ఉమా మహేందర్ (చార్మినార్), షెహజాది బేగం (చాంద్రాయణగుట్ట), హనీఫ్ అలీ (బహదూర్పుర), బల్మూరి వనిత (రామగుండం), డాక్టర్ శ్రీనివాస్ (కాగజ్ నగర్), సత్యవతి (ఖానాపూర్), శ్రీనివాస్ (చెన్నూర్), స్వర్ణరెడ్డి (నిర్మల్), రేష్మారాథోడ్ (వైరా), నాగ స్రవంతి (ఇల్లందు), ప్రకాష్ (చేవెళ్ల), ప్రహ్లాదరావు (పరిగి), శ్యామ్సుందర్ (భువనగిరి), వెంకటేశ్వర్లు (స్టేషన్ ఘన్పూర్), సారంగరావు (వర్థన్నపేట) పోటీ చేయనున్నట్టు తెలిసింది.