పీలారంలో స్వచ్ఛభారత్‌ రాష్ట్ర బృందం పర్యటన | Swachh Bharat State Team Tour In Peelaram | Sakshi
Sakshi News home page

పీలారంలో స్వచ్ఛభారత్‌ రాష్ట్ర బృందం పర్యటన

Jul 14 2018 9:36 AM | Updated on Jul 14 2018 9:36 AM

Swachh Bharat State Team Tour In Peelaram - Sakshi

గ్రామస్తులతో మాట్లాడుతున్న బృందం సభ్యులు 

అనంతగిరి: వికారాబాద్‌ మండలంలోని పీలారం గ్రామాన్ని రాష్ట్ర స్వచ్ఛభారత్‌ మిషన్‌ పరిశీలన బృంద ప్రతినిధులు శ్రావ్య, శ్రీనివాస్, ప్రదీప్‌ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని  బృందం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి స్వచ్ఛ్‌ భారత్‌ లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతూ వేలాది గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటిస్తున్నాయని వారు తెలిపారు.

ఈ ప్రాంతంలో సైతం అన్ని గ్రామాలను త్వరలోనే ఓడీఎఫ్‌గా ప్రకటించే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రెండు గుంతలు తప్పకుండా తవ్వాలని సూచించారు. రెండు గుంతల మధ్య మీటర్‌ దూరం తప్పకుండా ఉండాలని ఆ దూరం వల్లనే ఎరోబిక్‌ చర్య జరిగి మలం ఎరువుగా మారుతుందని తెలిపారు. ప్రతీగుంతలో నాలుగు రింగులు వేయాలని సూచించారు. రింగుల మధ్య ఒక ఇంచు గ్యాప్‌ ఉండాలని, రెండు గుంతలకు జంక్షన్‌ బాక్స్‌ ద్వారా కనెక్షన్‌ ఇచ్చి ఒకదాన్ని మూసేసి రెండో దాన్ని ఓపెన్‌ ఉంచాలని సూచించారు.

కుండీ ద్వారా మెయిన్‌ కనెక్షన్‌ జంక్షన్‌ బాక్స్‌కి ఇవ్వాలి. ఈ నిబంధనల మేరకే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. ఈ క్రమంలో వారు నిర్మించుకున్న,  నిర్మింపబడుతున్నా ఇంకా నిర్మాణం ప్రారంభంకాని లబ్ధిదారులతో మాట్లాడి అన్ని విషయాలను వారితో చర్చించారు. నెలరోజుల్లోనే 60 మరుగుదొడ్లను నిర్మించుకునుటకు కాకుండా ఇంకా దాదాపు వంద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నందుకు గ్రామస్తులను, సర్పంచ్‌ మండల బృందాన్ని ఎఫ్‌ఏ నర్సింలును  అభినందించారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు సర్పంచ్‌ ప్రభావతి చెక్కులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, ఎస్‌బీఎం జిల్లా కోఆర్డినేటర్‌ లక్ష్మి, ప్రతినిధి కిరణ్, ఏపీఓ శీను, ఏపీఎం లక్ష్మయ్య, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, వీఓ అధ్యక్షురాలు బేగం, ఈసీ నవీన్‌  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement