ఇద్దరిని మింగిన చెరువు

Son And Father Died In Khammam  - Sakshi

ఈత నేర్చుకునేందుకు చెరువులోకి దిగిన కుమారుడు

మునిగిపోతుండగా కాపాడేందుకు తండ్రి కూడా..

ఇద్దరూ నీటిలో మునిగి మృత్యువాత

బట్టలు ఉతికేందుకు వెళ్లగా ప్రమాదం

గుంపెళ్లగూడెంలో అలుముకున్న విషాదం

నాన్నా నేను ఈత నేర్చుకుంటా.. అంటూ ఆ బాలుడు చెరువు ఒడ్డు నుంచి నీళ్లలోకి దిగాడు. అంతేఒక్కసారిగా మునిగిపోతూ.. నాన్న.. నాన్న అని కేకలు వేశాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి కూడా చెరువులో దిగాడు. భయంతో తండ్రీకొడులకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరూ మునిగిపోయారు. ఇటీవల ‘మిషన్‌ కాకతీయ’ పనులతో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులు ఆ తండ్రీకొడుకుల ప్రాణాలు తీశాయి.

సాక్షి, కారేపల్లి: కొడుకు చెరువులో మునిగిపోతుండగా కాపాడబోయి తండ్రి కూడా నీటిలో మునిగి ఇద్దరూ మృత్యువాత పడ్డ సంఘటన కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం గ్రామంలో శని వా రం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన పిప్పళ్ల సత్యనారాయణ (45), పిప్పళ్ల సులోచ న దంపతులకు కుమారుడు పిప్పళ్ల భరత్‌ (14), కుమార్తె శైలజ ఉన్నారు. భరత్‌ సమీప గ్రామం పేరుపల్లి హైసూ్కల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శైలజ మణుగూరులోని ఓ హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది.

సత్యనారాయణ దంపతులు గ్రామంలో ఇస్త్రీ షాపు నడుపుకుంటూ, రజక వృత్తి నిర్వహించుకుంటూ, కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీన వారి ఎదురింట్లో వివాహ వేడుక జరిగింది. ఇంటిల్లిపాది వివాహవేడుకల్లో పాల్గొన్నా రు. శనివారం సత్యనారా యణ దంపతులు పెళ్లి ఇంటి బట్టలు ఉతికేందుకు సమీపంలోని మాధారం చెరువు అలుగు వద్దకు వెళ్లారు. స్వల్ప అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్ద ఉన్న భరత్‌ కూడా వారితోపాటు వెళ్లాడు.

పనిలో అమ్మానాన్నలకు సాయం చేశా డు. బట్టలు ఉతకటం పూర్తయ్యాక ఈత నేర్చుకుంటానంటూ చెరువు ఒడ్డు నుంచి నీటిలోకి దిగాడు. ఇటీవల మిషన్‌ కాకతీయ పథకంలో చేపట్టిన పనులతో చెరువు అలుగు వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. దీంతో బాలు డు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగి పోతూ.. ‘నాన్న నాన్న’అని కేకలు వేశాడు. అక్కడే ఉన్న తండ్రి.. కొడుకును కాపాడేందుకు చెరువులో దిగాడు. భయంతో ఒకరునొకరు గట్టిగా పట్టుకోవడం, తండ్రికి ఈతవచ్చినా.. ఈతకొట్టే వీలుకాక పోవటంతో..ఇద్దరూ నీటిలో మునిగి పోయారు. దీంతో తల్లి ఓ కొడుకో..! ఓ దేవుడో..!! అంటూ కేకలు వేసింది. కేకలు విన్న గ్రామ యువకులు పరుగు పరుగున వచ్చి చెరువులోకి దిగారు. అర్ధగంటపాటు గాలింపు చేపట్టారు.

చెరువు అడుగుకు చేరిన తండ్రీ కొడుకులను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఇద్ద రూ మృతి చెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు విగత జీవులుగా మారడంతో సులోచన కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకు మృతదేహం పై పడి ‘ఒక్కసారి లే కొడకా..! ఓ దేవుడా నా కొడుకుకు ఊపిరి ఊదు దేవుడా..!! అంటూ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సింగరేణి సీఐ బి శ్రీనివాసులు, ఎస్‌ఐ పొదిల వెంకన్న, ఆర్‌ఐ సక్రు, వీఆర్వో నాగలక్ష్మి సందర్శించారు. పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top