కాటేస్తున్న నిర్లక్ష్యం | snakebite medicine is not available at the time | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న నిర్లక్ష్యం

Feb 24 2018 2:57 AM | Updated on Aug 20 2018 7:28 PM

snakebite medicine is not available at the time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాముకాటు బాధితులకు సకాలంలో వైద్యమందడంలేదు. పల్లెల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో పాముకాటుకు సంబంధించిన ఔషధాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ వైద్యం మెరుగుపడిందని అధికారులు చెబుతున్నా, ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని ప్రైవేటు వైద్య సంస్థలు ప్రకటిస్తున్నా పాముకాటు మరణాలు మాత్రం ఆగడంలేదు. వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ఏటా ఐదువేల మంది పాముకాటుకు గురవుతున్నారు.

ప్రైవేటు వైద్యం, నాటు వైద్యం పొందేవారు మరో ఐదువేల మంది వరకు ఉంటున్నారు. కేవలం త్రాచు పాములతోనే ప్రాణభయం ఉంటుందని భావిస్తూ కట్ల పాము కరిస్తే ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే కొన్నిసార్లు ప్రాణనష్టం సంభవిస్తోంది. చాలామంది పొలాలకు వెళ్లే సందర్భాల్లోనే ఎక్కువగా పాముకాటుకు గురవుతున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఈ పరిస్థితి ఉంటోంది. పాముకాటు వల్ల మృతి చెందేవారి సంఖ్య ఏటా 600 వరకు ఉంది. రాత్రిపూట పాముకాటు వేసినా అది పాముకాటు అని గుర్తించకపోవడంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. చివరి నిమిషంలో వైద్యం కోసం వెళ్లినా పరిస్థితి చేయి దాటిపోయి మరణాలకు దారితీస్తోంది. మూడేళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పాముకాటు కేసుల సంఖ్య తగ్గింది.  

నమోదుకాని తేలు కాటు... 
ప్రమాదకరమైన తేలు కాటు కేసులను వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకోవడంలేదు. కనీసం కేసుల సంఖ్యను కూడా నమోదు చేయడంలేదు. తేలు కాటుకు గురయ్యేవారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉంటున్నారు. తేలు కాటు చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారుతోంది. మొత్తం శరీరాన్ని స్తంభింపజేస్తోంది. ఏకంగా నాలుగైదు రోజులు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉండాల్సి వస్తోంది. ప్రాణాలు పోయే పరిస్థితి లేకున్నా... తేలు కాటు విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement