పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్పై జిల్లావ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్పై జిల్లావ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ బంద్కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అటు టీఆర్ఎస్ శ్రేణులు... ఇటు పోలీసులు సంయమనం పాటించారు. బంద్లో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తాయి.
టీఆర్ఎస్ శ్రేణులతో పాటు పలు ప్రజాసంఘాలు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వాణి జ్య సంస్థలు సైతం స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పలుచోట్ల వ్యాపారులు తమ దుకాణాలు మూసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా బంద్లో పాల్గొనడంతో ప్రగతిచక్రం రోడ్డెక్కలేదు. తాండూరులో టీఆర్ఎస్ ఎమ్మె ల్యే పి.మహేందర్రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వామీగౌడ్, మేడ్చల్ మండల కేంద్రంలో ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. పోలవరం ఆర్డినెన్స్ను వెంటనే కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కలెక్టరేట్లో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.