మొదటి రోజు రెండు నామినేషన్లు | Police Force Security At Nominations Centers In Miryala Guda | Sakshi
Sakshi News home page

మొదటి రోజు రెండు నామినేషన్లు

Nov 13 2018 9:37 AM | Updated on Nov 13 2018 9:41 AM

Police Force Security At Nominations Centers In Miryala Guda - Sakshi

నామినేషన్‌ పత్రాలు ఆర్‌ఓకు అందజేస్తున్న లాలునాయక్‌, సుంకు శ్రీనీవాస్‌

సాక్షి,మిర్యాలగూడ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల దరఖాస్తులను రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ) జగన్నాథరావు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. కాగా మొదటి రోజు రెండు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుకు అందజేశారు. మిర్యాలగూడకు చెందిన తెలంగాణ యువజన సేవా సంఘం రాష్ట్ర «అధ్యక్షుడు సుంకు శ్రీనువాస్, దామరచర్ల మండలం దూద్య తండాకు చెందిన ధనావత్‌ లాలునాయక్‌ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో సుంకు శ్రీను ఈ ఎన్నికల్లోనే మొదటి సారి నామినేషన్‌ వేయగా లాలునాయక్‌ 2014లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

భారీగా పోలీస్‌ బందోబస్త్‌ 
ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభం కావడంతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట పోలీసులు భారీ బందోబస్త్‌ను నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కార్యాలయంకు నాలుగు వైపులా బారీ కేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను మళ్లించారు. కార్యాలయం గేటు వద్ద పోలీస్‌లు ప్రత్యేక బందోబస్త్‌ను నిర్వహించి నామినేషన్ల వేసే అభ్యర్థులను ప్రతిపాదింధించే ఓటర్లను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. నామినేషన్‌ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు డీఎస్పీ పలు సూచనలు చేశారు. బందోబస్త్‌లో సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, రాములు, రమేష్‌బాబులతో పాటు పోలీస్‌ బలగాలు ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement