మహాత్మా.. మన్నించు! | Partially destroyed of mahatma gandhi statue | Sakshi
Sakshi News home page

మహాత్మా.. మన్నించు!

Oct 2 2014 11:36 PM | Updated on Mar 28 2018 11:05 AM

గాంధీ జయంతి రోజే బాపూజీకి అవమానం జరిగింది.

 తాండూరు: గాంధీ జయంతి రోజే బాపూజీకి అవమానం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పాక్షికంగా ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. పట్టణంలోని గాంధీ చౌక్ లో బాపూజీ విగ్రహం ఉంది.

గాంధీ జయంతి నేపథ్యంలో బుధవారం మున్సిపల్ సిబ్బంది విగ్రహాన్ని శుభ్రం చేశారు. మహాత్ముడి ముఖ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారని గురువారం తెల్లవారుజామున పాలవ్యాపారులు, స్థానికులు గమనించారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు,  వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆ ర్య వైశ్య యువజన సంఘం సభ్యులు గాంధీచౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ నాగార్జునలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

అనంతరం అధికారులు గాంధీ విగ్రహానికి మరమ్మతు చేయించారు. బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దుండగుల దుశ్చర్య పై నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ చౌక్ నుంచి ఠాణా వరకు ర్యాలీ నిర్వహించారు. దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని ఠాణాలోకి వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. అనంతరం తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్యకు మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు ఫిర్యాదు చేశారు.

 ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా విగ్రహ ధ్వంసంపై ఆరా తీశారు. కార్యక్రమంలో   కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు సునీత, సుమిత్‌కుమార్‌గౌడ్, రజాక్‌తో పాటు కౌన్సిలర్లు సలింగదళ్లి రవికుమార్, శ్రీని వాస్, వాలీ శాంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు నరేందర్‌గౌడ్, సోమశేఖర్, కో- ఆప్షన్ సభ్యురాలు అనసూయ, నాయకులు కోట్రిక వెంకటయ్య, గాజుల శాంత్‌కుమార్, బంట్వారం భద్రేశ్వర్, కోర్వార్ నగేష్ తదితరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement