నిమ్స్‌ ఓపీ సేవలు షురూ | OP Services Started In NIMS Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ ఓపీ సేవలు షురూ

Apr 8 2020 4:33 AM | Updated on Apr 8 2020 4:33 AM

OP Services Started In NIMS Hospital Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామ్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు మం గళవారం నుంచి మొదలయ్యాయి. దేశంలో అ మలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా గత కొంతకాలంగా బోసిపోయినట్లున్న ఆస్పత్రికి మళ్లీ రోగుల రాక మొదలైంది. రవాణా సదుపాయం లేకపోవడం ఒక కారణమైతే..నిమ్స్‌లో కరోనా అనుమానితులకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో చాలామంది ఆస్పత్రికి రావడానికి భయపడిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను నాన్‌–కరోనా ఆస్పత్రిగా ప్రకటించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న రోగులు నిమ్స్‌కు రావడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సాధారణంగా అవుట్‌ పేషెంట్‌ విభాగాలను పాత భవనంలో ఓపీ బ్లాక్‌లోనూ, స్పెషాలిటీ బ్లాక్‌లోనూ నిర్వహిస్తారు. ప్రస్తుతం అన్ని ఓపీ సేవలను ఒక దగ్గరే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

మిలీనియం బ్లాక్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌..
ఓపీ సేవల కోసం వచ్చిన ప్రతిరోగికి ముందుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే ఓపీ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే వారిని గాం ధీ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. ఇలా మంగళవారం 280 మందికి స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. అందులో తొమ్మిది మందిలో కరోనా వైరస్‌ లక్షణాలున్నట్టు అనుమానిస్తూ ఆయా రోగులను గాంధీకి తరలించినట్టు సమాచారం. గతంలో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్‌ లక్షణాలు కన్పించిన నేపథ్యంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement