మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన చైతన్యపురి పరిధిలోని సమతాపురి కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కిమీరా(29) అనే వైద్య విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి ఇంజక్షన్ ద్వారా విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న కిమీరాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది.
మరో రెండు రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కిమీరా ఆత్మహత్య చేసుకోవటంతో తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కిమీరా ఉస్మానియాలో పీజీ చదువుతోంది. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.