పోలీసులమంటూ దారి దోపిడీ | Lead to exploitation at shamshabad area | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ దారి దోపిడీ

Nov 10 2014 12:10 AM | Updated on Aug 30 2018 5:27 PM

బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై లారీ ఆపి పోలీసులమంటూ దారి దోపిడీకి పాల్పడ్డారు.

* లారీ డ్రైవర్ల నుంచి రూ. 19వేలు
* వసూలు చేసి ఉడాయింపు

శంషాబాద్ రూరల్: బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై లారీ ఆపి పోలీసులమంటూ దారి దోపిడీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ల నుంచి రూ.19,000 తీసుకుని ఉడాయించారు. మండలంలోని పెద్దషాపూర్‌తండా- గొల్లూరు చౌరస్తాలో పీ-వన్ రోడ్డుపై శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఖలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు నుంచి ఓ లారీ బూడిద లోడ్‌తో చౌటుప్పల్ వెళ్తోంది.

శ్రీనివాస్‌రెడ్డి లారీ నడుపుతుండగా, మరో లారీ డ్రైవర్ విద్యాసాగర్‌రెడ్డి కొత్తూరు నుంచి మేడ్చల్ వెళ్లడానికి ఈ లారీలో ఎక్కాడు. బూడిద లారీ రాత్రి 8 గంటల సమయంలో మండలంలోని పాల్మాకుల నుంచి పీ-వన్ రోడ్డుగా మీదుగా గొల్లూరు చౌరస్తాకు చేరుకుంది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి లారీని అడ్డగించారు. తాము పోలీసులమని పేర్కొంటూ లారీ పత్రాలు చూపించమంటూ బెదిరించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి వద్ద రూ.5,000, విద్యాసాగర్‌రెడ్డి వద్ద 14,000 తీసుకుని బైక్‌పై పాల్మాకుల వైపు పరారయ్యారు.

అనుమానం వచ్చిన  డ్రైవర్లు వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దోపిడీకి పాల్పడిన యువకుల వయస్సు 25 ఏళ్ల వరకు ఉంటుందని, వీరు తెలుగులో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement