రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా | Lawyer Rama Rao Complained About Revanth Reddy To IT And ED | Sakshi
Sakshi News home page

రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా

Sep 29 2018 2:10 AM | Updated on Sep 29 2018 6:44 AM

Lawyer Rama Rao Complained About Revanth Reddy To IT And ED - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డిపై ఐటీ, ఈడీ అధికారుల సోదాలను రాజకీయ కుట్రలని పేర్కొనడం సరికాదని, ఆయన అక్రమ వ్యవహారాలపై సోదాలు జరుపుతున్నారని న్యాయవాది ఇమ్మనేని రామారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌కు ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారని దానికి సమాధానం చెప్పకపోయే సరికి దాడులు చేశారన్నారు. రూ.300 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారని తాను సీబీఐకి ఫిర్యాదు చేశానని, కానీ అంతకంటే ఎక్కువే అక్రమాస్తులు గుర్తించినట్లు మీడి యా ద్వారా తెలిసిందన్నారు.

రేవంత్‌ మొత్తం 19 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా వందల కోట్లు అక్రమార్జన చేశారన్నారు. సాయిమౌర్యా ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2003లో స్థాపించారని, ఇందులో రేవంత్‌ బావమరిది జయప్రకాశ్‌దే ముఖ్యపాత్ర అన్నారు. ఎలక్షన్‌ అఫిడవిట్‌లో సాయిమౌర్య సంస్థలో షేర్లు కొనుగోలు చేసినట్లు చూపారని, ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో షేర్లు ఎలా కొనుగోలు చేస్తారని తాను ఆరా తీయగా ఈ సంస్థను అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎన్నో భూ ఆక్రమణలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. దేశ, విదేశాల్లో మనీ ల్యాండరింగ్‌ జరిపినట్లు బయటపడ్డాయన్నారు. జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో కూడా ఎన్నో అక్రమాలు చేసినట్లు తానే బయటపెట్టానని, ఏడు ఫ్లాట్లు అక్రమం గా అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపణలు రుజువయ్యాయని తెలిపారు.   

ఎవరీ రామారావు..
రేవంత్‌పై సీబీఐ, ఐటీకి ఫిర్యాదు చేసిన రామారావు... ఒరిస్సాలోని బరంపురం ప్రాంతానికి చెంది న వ్యక్తి. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని వెంకటాపురం కాలనీలో ఉంటున్నారు. పడాల రామారెడ్డి కాలేజీ నుంచి లా పట్టా పొందిన రామారావుపై హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్లలో పలు కేసులతో పాటు 2016 నుంచి రౌడీషీట్‌ కూడా ఉంది. మిగిలిన రౌడీ షీటర్ల మాదిరిగానే రామారావును పలు సందర్భాల్లో బౌండోవర్‌ చేస్తున్నారు. క్లయింట్ల ద్వారా వచ్చే భూముల «ధృవీకరణలు స్వీకరించి నకిలీ ధృవపత్రాలు సృష్టించి సదరు గృహాలు, భూ ముల్లో పాగా వేస్తున్నట్లు ఫిర్యాదులున్నట్లు పోలీ సులు తెలిపారు. ఇతనిపై చిలకలగూడ పోలీ సులు 14 కేసులు నమోదు చేసినప్పటికీ 3 కేసుల్లోనే అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. ఈ కేసులన్నీ సీసీఎస్‌ పోలీసులకు బదిలీ చేశారు. సైబరాబాద్‌ పరిధిలోని చందానగర్‌లోనూ భూ కబ్జా ఫిర్యాదులు, కేసులున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement