
‘కాళేశ్వరం’ విద్యుత్ లైన్లకు 730 కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల కోసం నిర్మిస్తున్న పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా
ఎస్సారెస్పీ కాల్వల ఆధునికీకరణకు రూ.25.79కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల కోసం నిర్మిస్తున్న పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.730.20 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పంపింగ్ స్టేషన్ల మధ్య 400/220 కేవీ, 220/11 కేవీ విద్యుత్లైన్లను ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగిం చనున్నారు.
ప్రాజెక్టు కు మొత్తంగా 4,500 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు 400కేవీ, 220కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం అవసరమని, దీనికి సుమారు రూ.1,010 కోట్లు ఖర్చు అవు తాయని ప్రాధమికంగా అంచనా వేశారు. ప్రాజెక్టు కోసం మేడిగడ్డ వద్ద 3, ఎల్లంపల్లి వద్ద 2, మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 3 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా లైన్లకు నిధులు విడుదల చేశారు.
కాల్వల మరమ్మతులకు 25.79 కోట్లు
ఎస్సారెస్పీ స్టేజ్–1. స్టేజ్–2, కాకతీయ ప్రధాన కాల్వల పరిధిలో అత్యవసరమైన నిర్మాణాల మరమ్మతులు, లైనింగ్ పనులకు రూ.25.79 కోట్లు కేటాయిస్తూ నీటి పారుదల శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. కాకతీయ కాల్వల సామర్థ్యాన్ని పెంచాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో ఈ నిధులను విడుదల చేశారు.