ఇంటర్‌ పరీక్షా కేంద్రాల వివరాలకు ప్రత్యేక యాప్‌ | Intermediate Board Invented New Mobile Application For Students | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల వివరాలకు ప్రత్యేక యాప్‌

Feb 28 2020 3:53 AM | Updated on Feb 28 2020 3:53 AM

Intermediate Board Invented New Mobile Application For Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం ఇంటర్‌ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనుండగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బోర్డు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘టీఎస్‌బీఐఈ ఎం–సర్వీసెస్‌’యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని, దానిద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల ముందే కేంద్రానికి వెళ్లి, తామున్న ప్రాంతం నుంచి ఎంత సమయంలో అక్కడికి చేరుకుంటామో యాప్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థులు 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారిని నియమించామని తెలిపారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, 25,550 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 4,80,516 మంది మొదటి సంవత్సరం, 4,85,323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షకు హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement