
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ నేతలు కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు శుక్రవారం కేంద్ర పర్యాటక, గిరిజన శాఖ మంత్రులు కేజే ఆల్ఫోన్స్, జుయల్ ఓరంలను ఢిల్లీలో కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు.
గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమక్క–సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రమంత్రులను కోరారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించామన్నారు. జాతర జరిగే ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తి వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రులకు అందించినట్లు వారు తెలిపారు.
‘కాళేశ్వరాని’కి నిధులివ్వండి: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీసుకుంటున్న చొరవకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు. హైదరాబాద్–విజయవాడ రహదారిని ఎక్స్ ప్రెస్ వేగా మార్చాలని కోరారు. అలాగే హైదరాబాద్–ఖమ్మం రహదారి మధ్య లో వచ్చే చందుపట్ల గ్రామానికి బైపాస్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు లక్ష్మణ్ తెలిపారు. అలాగే మేడారం జాతరకు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్టు తెలిపారు.