మరోసారి వార్డుల పునర్విభజన | High Court Gives Green Signal To Municipal Elections In Nalgonda | Sakshi
Sakshi News home page

మరోసారి వార్డుల పునర్విభజన

Nov 30 2019 10:31 AM | Updated on Nov 30 2019 10:31 AM

High Court Gives Green Signal To Municipal Elections In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన మరోసారి చేపట్టనున్నారు. పుర ఎన్నికలపై ఉన్న పిటిషన్లను శుక్రవారం హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కొట్టివేసి మళ్లీ వార్డుల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా మున్సిపాలిటీల్లో తిరిగి వార్డుల పునర్విభజన చేపట్టి, ఓటరు జాబితాను సరిచేయనున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 36 వార్డులుంటే 48కి పెంచారు. నల్లగొండలో 40 ఉంటే 48 చేశారు. కొత్త మున్సిపాలిటీ అయిన హాలియాలో 12వార్డులు ఏర్పాటు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల విభజనలో కొందరు అధికారులు.. అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించడం, ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఎన్నికలను నిలుపుదల చేసి అవకతవకలను సరిచేయాలని జూలైలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ఇప్పుడు స్టే ఎత్తివేయడంతోపాటు పిటిషన్లను కొట్టివేయడంతో పై మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తిగా రద్దు చేసి కొత్తగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.

పిటిషన్ల కొట్టివేతతో ఆశావహుల్లో చర్చ ..
మున్సిపల్‌ ఎన్నికలపై కోర్టులో కేసులు నడవడం, పలుమార్లు వాయిదా పడడంతో ఆశావహుల్లో నిర్లిప్తత ఏర్పడింది. ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే మరో 20 రోజుల్లో వార్డుల పునర్విభజన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల అధికారుల నియామకం, సరిహద్దులు గుర్తించడం, వార్డులను పెంచడం, ఎన్నికల అధికారులకు శిక్షణ, పోలింగ్‌స్టేషన్లను గుర్తించడంలాంటి పనులు పూర్తిచేసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement