కోర్టు తీర్పునకు లోబడే ‘మెరీడియన్‌’ రిజిస్ట్రేషన్లు | High Court directive to Lotha Constructions | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పునకు లోబడే ‘మెరీడియన్‌’ రిజిస్ట్రేషన్లు

Nov 1 2017 3:42 AM | Updated on Aug 31 2018 8:34 PM

High Court directive to Lotha Constructions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలో నిర్మించిన మెరీడియన్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న మేరకు జరిపే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా కోర్టు వెలువరించే తదుపరి తీర్పునకు లోబడి ఉంటాయని  హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తనఖా పెట్టిన 24 ఫ్లాట్లతో పాటు ఖాళీగా ఉన్న 73 ఫ్లాట్లను సైతం ఎట్టి పరిస్థితు ల్లోనూ విక్రయించరాదని లోథా కన్‌స్ట్రక్షన్స్‌ను హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఆ సంస్థ ఇచ్చిన హామీని నమోదు చేసుకుంటూ, లోథా దాఖలు చేసిన అప్పీళ్ల ను మూసివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

లోథా సంస్థ నిర్మించిన బెల్లేజా, మెరీడియన్‌ నివాస సముదాయాల మధ్య ఉన్న గోడ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ లోథా కన్‌స్ట్రక్షన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఖాళీ ఫ్లాట్లను విక్రయించవద్దని ఆదేశాలిచ్చారు. గోడ కూల్చివేతపై యథాతథస్థితిని కొనసాగించాలన్నారు. ఈ ఆదేశాలపై లోథా సంస్థ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఎవరైనా కొనుగోలుదారు తమ ఫ్లాట్లను రిజిçష్టర్‌ చేయాలని కోరితే, అదే విషయాన్ని నోటీసు ద్వారా మెరీడియన్, బెల్లేజా నివాసితులకు తెలియజేయాలని లోథా సంస్థను ఆదేశించింది. రిజిస్ట్రేషన్లన్నీ కూడా కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ అప్పీళ్లను మూసివేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement