ముదిరాజ్‌లను అన్నివిధాలా ఆదుకుంటాం

Helfull To Mudiraj Comminity In Nizamabad - Sakshi

ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి,బాన్సువాడ(నిజామాబాద్‌): ముదిరాజ్‌ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో కొత్త బాన్సువాడ ముదిరాజ్‌ కులస్తులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తు చేసిన తీర్మాణ పత్రాన్ని మంత్రికి అందజేశారు. మంత్రికి పూలు, పండ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడలో ఉన్న పేద ముదిరాజ్‌ కులస్తులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలాలు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. బీసీ కార్పోరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముదిరాజ్‌ కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చేందుకు మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

ఎకరం, అర ఎకరం భూమి ఉన్న ముదిరాజ్‌లకు సబ్సిడిపై పూలు, పండ్లు పెంపకం కోసం పాలీహౌస్‌ను మంజురు చేయిస్తామని అన్నారు. విత్తనాలు, డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పాత బాన్సువాడ ముదిరాజ్‌ కళ్యాణ మండపంకు రూ. 30 లక్షలు, కోటగిరిలో ముదిరాజ్‌ కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్‌ సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నియోజకవర్గ నాయకులు గురువినయ్, మండల అధ్యక్షులు గడుమల లింగం, కొత్త బాన్సువాడ అధ్యక్షులు ఉప్పరి లింగం, వైస్‌ ఎంపిపి జిన్న రఘురామయ్య, జిల్లా నాయకులు మామిళ్ల రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, ఏజాస్, పాత బాలక్రిష్ణ, పంతులు రాము, నార్ల ఉదయ్, రాజేష్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top