బీజేపీలోకి అన్నపూర్ణమ్మ!

Former MLA Annapurnamma Joined In BJP At Nizamabad - Sakshi

సాక్షి, సుభాష్‌నగర్‌: మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మను లక్ష్మణ్‌ పార్టీలోకి ఆహ్వానించగా అంగీకరించినట్లు తెలిసింది. వారి చేరికకు అక్టోబర్‌ నెలలో ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.

బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేరికలపై దృష్టి సారించింది. ఈ మేరకు నియోజక వర్గా ల్లో పట్టు ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సైతం ఎంపీ అర్వింద్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించికుంది. భేటీ అనంతరం షకీల్‌ తనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా అర్వింద్‌ ఉన్నట్లు చెప్పగా, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే ఎంపీ ని కలిసినట్లు షకీల్‌ ప్రకటించారు. బీజేపీ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని పట్టు ఉన్న నేతలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, నిజామాబాద్‌ రూరల్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించే నేతల కోసం అన్వేషిస్తున్నారు. అధికార పార్టీతో పాటు ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడేలా ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top