అన్నదాతా తొందరొద్దు..

Dont Use Seeds Wait Rains Farmers Warangal - Sakshi

కాళోజీసెంటర్‌: రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు.. సమయమేమి మించిపోలేదు.. వర్షాలు పడ్డాకనే వేయడం మంచిదని జేడీఏ ఉషాదయాళ్‌ రైతులకు సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌ విత్తనాలు, ఎరువుల విషయమై రైతుల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆయా సందేహాలను నివృత్తి చేయడానికి సాక్షి నడుం బిగించింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం కొనసాగింది.  జిల్లాలో సాగులో  ఎదురవుతున్న సీజన్‌కు సంబంధించిన అంశాలు, సబ్సిడీ విత్తనాలు, రైతు బంధు, పీఎం కిసాన్‌  డబ్బులు, రైతు బీమా తదితర సమస్యల గురించి ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 26 మంది రైతులు ఫోన్‌ చేశారు. రైతులు అడిగిన సందేహాలను జేడీఏ ఉషాదయాళ్‌ నివృత్తి చేశారు. వారికి దశల వారీగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. మీకు గతంలో డబ్బులు వస్తే మాత్రం మీకు ఖాతాలో పడుతాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దశల వారీగా పడుతున్నాయి. కొత్త పట్టా పాస్‌బుక్‌లు ఉన్నవారు మాత్రం సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ ఇవ్వండి. ప్రధానంగా రైతులు ఫసల్‌ బీమా చేయాలి. బీమా చేసిన రైతులకు నష్టం జరగకుండా బీమా డబ్బులు వస్తాయి.

ప్రశ్న : పంటల బీమా ఇన్సూరెన్స్‌ రాలేదు. మా దగ్గర బాండ్‌ లేదు ఏమిచేయాలి..?– బత్తుల రాజు, గీసుకొండ మండలం, కొనాయమాకుల
జేడీఏ: పంటల బీమా ఇన్సూరెన్స్‌ గనుక మీరు చేస్తే ఎల్‌ఐసీ వాళ్ల దగ్గర బాండ్‌ ఉంటుంది. దానికి సంబంధించి సమాచారం కొరకు మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే ఐడి నంబర్‌ చెబుతారు. నంబర్‌ ఆధారంగా ఎందుకు రాలేదో 
తెలుసుకోవచ్చు. 
ప్రశ్న : పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదు..?– సదయ్య, కొత్తగూడ, సంగెం.
జేడీఏ: పీఎం కిసాన్‌ డబ్బులకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉండడం వల్ల రాలేదు. ఇప్పడు కోడ్‌ అయిపోయింది. వస్తాయి. 
ప్రశ్న : పత్తి గింజలు ఇప్పుడు పెట్టొచ్చా ..?– సంజీవ, గొర్రెకుంట, గీసుకొండ
వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ : పత్తి గింజలు ఇప్పుడే వేయొద్దు్ద. 60.70 మిల్లీమీటర్ల వర్షం పడితేగాని వేయాలి. అంతవరకు వేయకూడదు. జూన్‌ 20 నుంచి 25 వరకు అవకాశం ఉంది. సహజంగా రోహిణీ కార్తెలో విత్తనాలు వేస్తారు. కాని వర్షాలు పడలేదు కాబట్టి వేయకూడదు. 
ప్రశ్న : విత్తన తయారీకి ఏ రకమైన విత్తనాలు వాడితే మంచిది..?– బాబురావు, పరకాల 
వ్యవసాయ శాస్త్రవేత్త : విత్తనం తయారు చేయడానికి గ్రేడింగ్‌ విత్తనాలనే వాడాలి. వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త డాక్టర్‌ జగన్మోహన్‌ గారిని సంప్రదించాలి (సెల్‌ నెంబర్‌ 998962533)వారి పర్యవేక్షణలో విత్తనాల ఉత్పత్తి తయారు చేస్తారు. సొంతంగా తయారు చేయడం మంచిది కాదు. 
ప్రశ్న : సబ్సిడీ విత్తనాలు గ్రామస్థాయిలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎరువుల దుకాణాలో తనిఖీలు చేయాలి కదా మేడం..?– శ్రీనివాస్, ఎల్గూర్‌రంగంపేట, సంగెం
జేడీఏ: నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆలోచిస్తాం.

ప్రశ్న : పసుపు విత్తనం ఏ విధంగా పెట్టాలి..? – రవీందర్, కొండాయి, నల్లబెల్లి
ఉద్యానశాఖ జేడీఏ శ్రీనివాస్‌రావు : వర్షాలు పెద్దవి పడాలి.. దుక్కి చదును చేసుకొని సిద్ధంగా ఉంచుకొని పెద్ద వర్షం పడ్డాక బోదెలు తయారు చేసి విత్తాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి లాభం ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top