నల్లగొండలో కరోనా కలకలం
పరీక్షలకోసం హైదరాబాద్కు తరలింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ /నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాలో ‘కరోనా’కలకలం సృష్టించింది. వియత్నాం నుంచి 12 మంది మతబోధకులు జిల్లా కేంద్రానికి వచ్చినట్టు తెలియడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వియత్నాంనుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన 12 మంది మత బోధకులను గుర్తించిన జిల్లా పోలీసులు వారిని గురువారం రాత్రి రెండు అంబులెన్సుల్లో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడి ఫీవర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. ‘నల్లగొండలోని జైల్ఖానా సమీపంలో ఒక ప్రార్థనా మందిరంలో వియత్నాంకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి కరోనా లక్షణాలు లేకున్నా.. ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించాం..’అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ వార్త శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వియత్నాం నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ ఉందా? లేదా? అనే విషయమై వైద్య పరీక్షలకోసం హైదరాబాద్కు తరలించామని, వారంతా బాగానే ఉన్నారని అధికార వర్గాలు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఓ ప్రార్థనమందిరంలో విచారిస్తున్న పోలీసులు
సంబంధిత వార్తలు