లంచాలకు కళ్లెం

CM KCR Orders To Ready New Revenue And Municipal Legislations - Sakshi

ఆ మేరకు కొత్త రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలు రూపొందించండి : సీఎం కేసీఆర్‌

తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు 

పట్టణాలు, గ్రామాల్లో వసతుల కల్పన ముఖ్యం 

జిల్లా స్థాయిలోనే పటిష్టమైన పరిపాలన వ్యవస్థ ఉండాలి

కొత్త చట్టాల రూపకల్పనపై అధికారులతో సీఎం సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు మరింత బాగా సేవలందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్‌ చట్టాలను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్‌ పాలసీ రూపొందించాలన్నారు. కలెక్టర్‌/జిల్లా పరిపాలనాధికారి(ఐఏఎస్‌) నాయకత్వంలో అడిషనల్‌ కలెక్టర్‌/అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ వంటి అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు (అసెస్మెంట్స్‌) తదితర పనులన్నీ ఈ బృందం ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ తరహాలో తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టాల రూపకల్పనపై కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  

చట్టం కఠినంగా ఉండాల్సిందే.. 
‘ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు గొప్ప బాధ్యతలేవీ లేవు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలకు పనులు జరగాలి. రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలను తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం.

ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకపోతేనే.. ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది. నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్‌ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్‌ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అని పిలవాలా? అని ఆలోచించాలి. కలెక్టర్‌ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బందాన్ని ఏర్పాటు చేయాలి.

వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఏఎస్‌ అధికారి నాయకత్వంలోని అధికారుల బందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్‌/పరిపాలనాధికారి, అడిషనల్‌ కలెక్టర్‌/అడిషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లేఔట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్‌) తదితర పనులు ఐఏఎస్‌ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది’అని కేసీఆర్‌ సూచించారు. 
 
మౌలిక వసతులపై ఎక్కువ దృష్టి 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దష్టి పెట్టాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం (శ్మశానం) నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి. తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతోంది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్‌ పాలసీ రూపొందించాలి. 

హైదరాబాద్‌ నగరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్‌ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, అరవింద్‌ కుమార్, నీతూప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు పాల్గొన్నారు.  

అడిషనల్‌ సీఎస్‌లను నియమించాలి : కేసీఆర్‌

జిల్లా స్థాయిలో ఐఏఎస్‌ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సీఎస్‌ ఆధ్వర్యంలో అడిషనల్‌ సీఎస్‌లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఏఎస్‌ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్‌ 
నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఈ బృందం ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top