
క్రిస్మస్ కాంతులు
జిల్లాలో చర్చీలన్నీ క్రిస్మస్ పండుగ శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్థన మందిరాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి.
మహబూబ్నగర్ : జిల్లాలో చర్చీలన్నీ క్రిస్మస్ పండుగ శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్థన మందిరాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. పదిహేను రోజులుగా సెమీక్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. నేడు క్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని క్రైస్తవులు ఇళ్లపై స్టార్లైట్ను ఏర్పాటు చేశారు. ఆయన జననం ప్రపంచ మానవాళికి శాంతి సందేశమిచ్చిందని, ఆ కరుణామయుడి జన్మదినం అందరికీ ఎంతో శుభదినం కావాలని పలువురు సందేశకులు ఆకాంక్షించారు.
పాలమూరుకు క్రిస్మస్ కల సంతరించుకుంది. కరుణామయుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో చ ర్చీలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్కాంతుల్లో చర్చీలు ధగధగ మెరిసిపోతున్నాయి. గద్వాల, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి ప్రాంతాల్లో సెమీక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బేకరీలు, స్టార్స్ దుకాణాలు కిటకిటలాడాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా దుకాణాల ముందు క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాతబొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించారు.