మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు ఉందా?

Central Government Conducting Nationwide Telephone Survey - Sakshi

దేశవ్యాప్త టెలిఫోనిక్‌ సర్వేను నిర్వహిస్తున్న కేంద్రం

కరోనా వైరస్‌ వ్యాప్తి అంచనాకు డేటా వినియోగం

ఎన్‌ఐసీ ద్వారా 1921 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఫోన్‌ కాల్స్‌

వాస్తవ సమాచారం వచ్చేది డౌటే అంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలున్నాయా?’.. అంటూ మీ మొబైళ్లకు ఫోన్లు వస్తే కంగారు పడకండి. కరోనా మహమ్మారి విస్తరణ, వైరస్‌ వ్యాప్తిపై వాస్తవ పరిస్థితిని, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంతో పాటు వైరస్‌ ఏ మేరకు వ్యాపించింది, ప్రస్తుత పరిస్థితిని గురించి స్పష్టమైన అంచనాకు వచ్చేందుకు కేంద్రం ఈ పద్ధతిని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారక ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం (ఇన్‌ఫ్లూయెంజా లైక్‌ ఇల్‌నెస్‌–ఐఎల్‌ఐ) లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి కరోనా వైరస్‌ సోకిందా లేదా అని పరీక్షలు నిర్వహించి, ఆ లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌కు పంపించాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత ప రిస్థితుల్లో సువిశాల దేశంలో కరోనా లక్షణాలున్న వారి గుర్తింపు ప్రక్రియ అసంభవంగా మారిన నేపథ్యంలో అతి పెద్ద టెలిఫోనిక్‌ సర్వే ద్వారా ఈ పనిని పూర్తిచేయాలని నిర్ణయించింది. అయితే తాము జాతీయ స్థాయిలో ఈ టెలి సర్వేను మొదలుపెట్టడానికి ముందే దీనికి సంబం ధించిన అవగాహన, చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

టాస్క్‌ఫోర్స్‌ సూచనల మేరకు.. 
నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా నిర్వహించే ఈ సర్వేకు 1921 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేంద్రం ఉపయోగించబోతోంది. ఈ నంబర్‌ నుంచి దేశంలోని అన్ని ఫోన్లకు కాల్‌ చేసి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలపై సమాచారం సేకరిస్తారు. కరోనా లక్షణాలపై ఆరా తీసేందుకు ప్రభుత్వపరంగా సేకరిస్తున్న సమాచారం కాబట్టి.. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఈ వైరస్‌ లక్షణాల వ్యాప్తి, విస్తరణకు సంబంధించి నిర్దిష్టమైన ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వా లని కోరుతోంది. సర్వే నిర్వహణకు సంబంధించి, దీని ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం తాజాగా ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశంలో 90 శాతం కుటుంబాలకు మొబైల్‌ ఫోన్ల సౌకర్యం అందుబా టులో ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే టెలి సర్వే సందర్భంగా తమకు లేదా కుటుంబసభ్యులకు కరోనా వైరస్‌ లక్షణాలున్నాయని వెల్లడించిన పక్షం లో వెంటనే వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి.

నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సూచనల మేరకు ‘మెగా ఎపిడెమియోలాజికల్‌ సర్వే’లో భాగంగానే ఈ సర్వేను చేపడు తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ టెలి సర్వే ద్వారా ఐఎల్‌ఐ లక్షణాలు న్న కేసులను దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో వర్గీకరించనున్నారు. ఇలాంటి వాటిలో అనుమానిత కేసులెన్నో గుర్తించి హోంక్వారంటైన్‌కు పరిమితం చేసి, ఆపై వైద్యపరంగా చికిత్స అందించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మొబైల్‌ ఫోన్ల వినియోగదార్లకు ఫోన్‌ చేయడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి అనుమానితులతో పాటు ఏ స్ధాయిలో అది విస్తరించిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే సర్వే ఫలితాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక కూడా విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నా వాటిని పలువురు దాచిపెట్టారని, కాబట్టి టెలి సర్వేలో ఏ మేరకు నిజాలు చెబుతారనేది తెలియదని వారంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top