‘నాడు మాటిచ్చి.. నేడు మరిచారు’ | BJP President Laxman Fires On CM KCR On RTC Issue | Sakshi
Sakshi News home page

నాడు మాటిచ్చి.. నేడు మరిచారు: లక్ష్మణ్‌

Oct 7 2019 12:45 PM | Updated on Oct 7 2019 2:43 PM

BJP President Laxman Fires On CM KCR On RTC Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయం‍లో సీఎం కేసీఆర్‌ స్వలాభం కోసం చాలా మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాకా అన్నీ మర్చిపోయారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి వహిస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్‌.. కార్మికులను వీధులపాలు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. పాత బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోడం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని పేర్కొన్నారు. నెలక్రితం సమ్మె నోటీసులు ఇస్తే.. ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేయిటీకరణ చేయడం కోసం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలూ జరపబోమని తేల్చి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. ఈ సందర్భంగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాపంగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement