దసరా నాటికి ‘భగీరథ’ నీళ్లు  

Bhagiratha Water From Dasara - Sakshi

హరితహారం లక్ష్యం పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట

హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో మిషన్‌ భగీరథ ఇంట్రావిలేజ్‌ పనులు మొత్తం సెప్టెంబర్‌ ఆఖరు నాటికి పూర్తి చేసి దసరా పండగ నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు అధికారులు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుబేదారి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలూ.. హరితహారం లక్ష్యం చేరుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో నాటిన మొక్కలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు చేయడంతోపాటు ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్‌ చేయాలన్నారు.

ఎంపీడీఓల స్థాయిలో ప్రతి వారం లక్ష మొక్కలు నాటేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ధేశించిన నర్సరీల నుంచి మొక్కలు తెప్పించుకోవాలన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకం కోసం నర్సరీలు సిద్ధం చేసుకోవాలన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో 75లక్షలు, కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 60లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా 60లక్షలు, అటవీ శాఖ ద్వారా 23లక్షల మొక్కలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం నిర్ధేశించిన 62లక్షల మొక్కల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. డీఎఫ్‌ఓ అర్పణ, డీఆర్‌డీఓ రాము, అర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మల్లేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top