32 వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం | 32,000 crore turnover target | Sakshi
Sakshi News home page

32 వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

Dec 24 2017 2:41 AM | Updated on Dec 24 2017 2:41 AM

32,000 crore turnover target - Sakshi

సాక్షి, కొత్తగూడెం: వచ్చే ఏడాది రూ.32 వేల కోట్ల టర్నోవర్‌ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. సింగరేణి ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రూ.18 వేల కోట్లు, ఈ ఏడాది రూ.23 వేల కోట్ల టర్నోవర్‌ సాధించి నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం 52 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ.. ఈ ఏడాది 66 మిలియన్‌ టన్నుల రవాణాకు ప్రణాళికలు రూపొందించుకుందని, ఈ విషయంలో గత మూడేళ్లలో వరుసగా 11.5శాతం, 4శాతం, 10శాతం వృద్ధి సాధించిందని వివరించారు.

2015లో రూ.1,050 కోట్లు, 2016లో రూ.800 కోట్ల లాభాలు గడించామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 12 కొత్త గనులు ప్రారంభిస్తున్నామని, ఇందులో 6 ఓసీలు, 6 భూగర్భగనులు ఉన్నాయని తెలిపారు. సింగ రేణి ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోందన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను తీసుకున్నామని, రెండు, మూడేళ్లలో నైనీ బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే విద్యుత్‌ రంగంలోకి అడుగుపెట్టామని, 11 ఏరియాల్లో ఒక్కొక్కటి 500 మెగావాట్ల చొప్పున సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. జైపూర్‌లో ఏర్పాటుచేసిన థర్మల్‌ ప్లాంట్‌తో పాటు సోలార్‌ ప్లాంట్ల ద్వారా 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు వేతనంతో కూడి న సెలవులు ఇస్తూ సర్క్యులర్‌ జారీ చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement